మేడ్చల్, మే 4 (నమస్తే తెలంగాణ): ‘హైదరాబాద్ నగరం మన అందరికీ అన్నం పెట్టె అమ్మ లాంటింది. ఇక్కడ బీజేపీ వచ్చిందంటే.. హైదరాబాద్ను ఇతర నగరాల మాదిరిగా విషనగరంగా మార్చేస్తుంది. విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ కావాలా..విష నగరంగా మార్చే బీజేపీ కావాలా.. మనిషి ఎవరైనా.. మతం ఏదైనా.. పేదరికమే ముఖ్యమని.. అందరినీ కాపాడుకున్న బీఆర్ఎస్ ముఖ్యమా?.. ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగా ముస్లింలను అవమానిస్తున్నారు.
హిందూ.. ముస్లింలు అంటూ చిచ్చు పెట్టుడు బీజేపీకి అవసరమా..? హైదరాబాద్ విశ్వనగరంగా ఉండాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలి. విష నగరంగా మారాలంటే బీజేపీకి ఓటు వేయాలి’.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిగ్గు లేకుండా 5 గ్యారెంటీలను అమలు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని షాపూర్నగర్ చౌరస్తా వద్ద మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా శనివారం కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పథకాల మాట ఏమోగానీ.. కాంగ్రెసోళ్ల లూటీ మాత్రం ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర నెలలోనే కొత్త పరిశ్రమలు తీసుకొచ్చుడేమో కానీ.. ఉన్న పరిశ్రమలు హైదరాబాద్ నుంచి తరలిపోతున్నాయన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి చెన్నె, గుజరాత్ రాష్ర్టాలకు అనేక పరిశ్రమలు తరలిపోయినట్లు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్లో తిరిగి కరెంటు, నీటి కష్టాలు మొదలయ్యాయన్నారు.
బీజేపీ అభ్యర్థి ఓట్ల కోసం వస్తే హైదరాబాద్కు మోదీ ఏం చేశారో అడగాలని కేటీఆర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు 16 సీట్లించి కేసీఆర్పై అభిమానాన్ని చాటారన్నారు. నాలుగు నెలల కాలంలోనే మళ్లీ సీఎంగా కేసీఆర్ ఉంటే బాగుండని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. అతి తక్కువ శాతం ఓట్లతో మాత్రమే బీఆర్ఎస్ ఓటమి పాలైందని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరూ పొలిటికల్ టూరిస్టులేనని, ఒకరు చేవెళ్ల..ఇంకొకరు హుజురాబాద్ నుంచి వచ్చారని, ఎన్నికలు కాగానే వాళ్లు వెళ్లిపోతారని..కానీ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి స్థానికంగా ఉంటారన్నారు. ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి రాగిడి లక్ష్మారెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
గతంలో మల్కాజిగిరికి ఎంపీగా ఉన్న రేవంత్రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేమీలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ను అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని దేశంలో గుర్తింపు తెచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనన్నారు. ఈ రోడ్ షోలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు తదితరులు పాల్గొన్నారు.
-రాగిడి లక్ష్మారెడ్డి