Handloom | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేనేత రంగం చతికిలపడింది. నేతన్నల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. నేతన్నల బకాయిలను కొత్త సర్కారు చెల్లించకపోవడంతో చేనేత రంగం నిస్తేజంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్లు సైతం ఒక్కసారిగా నిలిచిపోవడంతో నేతన్నలకు చేతిలో పనిలేకుండా పోయింది.
ఫలితంగా మళ్లీ తెలంగాణ ఏర్పాటునకు ముందు ఉన్న పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. మగ్గాలు, సాంచాల సప్పుడు ఇప్పుడు నిలిచిపోయింది. మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. తెలంగాణ చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక పథకాలను అమలుచేసిన విషయం విధితమే.
చేనేత రంగానికి కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్లో ఏటా రూ.1,200 కోట్ల వరకు కేటాయింపులు జరిపింది. నేతన్నలకు చేతినిండా పని కల్పించాలని బతుకమ్మ చీరల కోసం ఏటా రూ.350 కోట్ల ఆర్డర్లు, రూ.200 కోట్లతో ప్రభుత్వ ఉద్యోగులు, గురుకులాల విద్యార్ధుల యూనిఫామ్స్తోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన వస్ర్తాల తయారీ ఆర్డర్లు, సుమారు రూ.50 కోట్లతో రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ఆర్డర్లు ఇచ్చింది. సబ్సిడీ ధరలకు రంగులు, నూలు వంటివి సరఫరా చేసింది.
చేనేత మిత్ర పథకం ద్వారా ముడిసరుకుపై 50 శాతం సబ్సిడీ, రైతు బీమా తరహాలో నేతన్నకు బీమా వంటి కార్యక్రమాలను అమలుచేసింది. కాగా, రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు చేనేత రంగంపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. గతంలో అమలైన ఏ పథకం అమలుకు కూడా ఆసక్తి చూపడంలేదు. ఏమైనా కొత్త పథకాలను ప్రవేశపెడుతుందా అంటే.. అదీలేదు. ఫలితంగా రాష్ట్రంలో తరచూ నేతన్నల ఆత్మహత్యల తాలూకు వార్తలు మళ్లీ కనిపిస్తున్నాయి.
కానరాని నేతన్నకు చేయుత,నేతన్న బీమా పథకాలు
నేతన్నకు చేయూతలో భాగంగా నాటి కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికుడు పొదుపు చేసే మొత్తంలో 8 శాతానికి రెట్టింపుగా 16 శాతం, పవర్లూమ్ కార్మికులు పొదుపు చేసుకొనే మొత్తంలో 8 శాతానికి అదనంగా మరో 8 శాతం మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా వారి ఖాతాల్లో జమ చేసింది. 2017లో ప్రారంభమైన ఈ పథకం వల్ల రూ.100 కోట్ల మేర ప్రయోజనాన్ని 32 వేల మంది నేతన్నలు పొందారు. రైతు బీమా మాదిరే నేతన్నకు ప్రత్యేకంగా రూ.5 లక్షల నేతన్నకు బీమా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. 75 ఏండ్లలోపు 50,000 మంది నేతన్నలకు బీమాను వర్తింపజేశారు. ఈ పథకంపై అమలుపై కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నోరు మెదపడంలేదు.
అంతరించిపోయిన కళలకు కేసీఆర్ పూర్వవైభవం
చేనేత కళ అంతరించి పోకుండా భవిష్యత్తు తరాలకు అందించాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో టెస్కో ద్వారా ప్రత్యేక ఆర్అండ్డీ విభాగాన్ని ఏర్పాటు చేసింది గత కేసీఆర్ సర్కారు. తెలంగాణలో ఒకప్పుడు ప్రాచుర్యం పొంది కాలక్రమేణా అంతరించిపోయిన చేనేత కళాకృతులను వెలికితీసి, వాటికి నవీనరీతులను జోడించింది. త ద్వారా టెస్కో పీతాంబరి పట్టు చీరలు, ఆ ర్మూరు పట్టు చీరలు, హిమ్రా చేనేతలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, మహాదేవపూ ర్ టస్సర్ పట్టుచీరలు వంటి ఒకప్పటి గొ ప్ప కళాకృతులను పరిశోధించి, తిరిగి వెలికితీసి మనుగడలోనికి తీసుకొని వచ్చింది.
చేనేత మిత్రపై చిన్నచూపు
అప్పుల ఊబిలో చికుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. 2010 నుంచి లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయడంతో 10,148 మంది చేనేత కార్మికులకు రూ.28.97 కోట్లమేర రుణ విముక్తి కలిగింది. చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలను గుర్తిస్తూ, వారి మగ్గాలను జియో ట్యాగ్ చేసింది.
దేశంలో ఎకడా లేనివిధంగా చేనేత మిత్ర పథకం ద్వారా 50% రాయితీని వస్త్రాలు, రసాయనాల కొనుగోలుపై అందించింది. పదేండ్ల్లలో చేనేత మిత్ర పథకం ద్వారా 20,500 మంది నేతన్నలకు సుమారు రూ.41.2 కోట్ల సబ్సిడీని నేరుగా వారి ఖాతాలలోనే జమ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రుణమాఫీ పక్కకుపెడితే కనీసం గత ప్రభుత్వం అమలుచేసిన చేనేతమిత్రను సైతం యథావిధిగా అమలు చేయడంలేదు.