మేడ్చల్, మే 4 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వం డి. మళ్లీ ఆరు నెలల్లోనే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుంది’ అని ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని షాపూర్నగర్ చౌరస్తా, కంటోన్మెంట్లో మల్కాజిగిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెలే అభ్యర్థి నివేదితకు మద్దతుగా రోడ్షోల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండియా, ఎన్డీయే కూటమిలో లేని 13 పెద్ద పార్టీలు ఉన్నాయని, ఎన్నికల తర్వాత ఈ పార్టీలే ఢిల్లీని శాసించవచ్చని అన్నారు. అత్యధిక ఎంపీ సీట్లు సాధించి మనం ఢిల్లీని లొంగదీసుకుందామా? లేకా యాచిద్దామా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ దుష్ట ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణకుగొంతు ఉండాలంటే గూలాబీ కండువా ఉండాలని తెలిపారు. మోదీ 2 కోట్ల ఉద్యోగాలు, పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని మోసం చేయగా, సీఎం రేవంత్ 6 గ్యారెంటీల పేరుతో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం బీజేపీతో కలుస్తున్నామని ఆరోపిస్తున్నరు. నా చెల్లి, ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టిండ్రు. అలాంటి బీజేపీతో మేం కలుస్తమా?’ అని అడిగారు. ఇక, 2014, 2019ల్లో మోదీ హవా ఉన్నా బీజేపీని ఓడించింది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు.
తండ్రి, సోదరి చనిపోయినా కంటోన్మెంట్ ప్రజలే తన కుటుంబమని ముందుకొచ్చిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితను గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘మీ బిడ్డలా భావించి నివేదితను భారీ మెజార్టీతో గెలిపించండి. మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి తెలంగాణ గొంతుకను పార్లమెంట్లో వినిపించాలి’ అని కోరారు. రోడ్షోలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మర్రి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు తదితరులు పాల్గొన్నారు.