BRS | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 4 (నమస్తే తెలంగాణ): ఇన్నాళ్లూ నిరంతరాయంగా కొనసాగిన కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం… తొమ్మిదిన్నరేండ్లు పుష్కలమైన నీటి సరఫరా ఉన్న నగరంలో మళ్లీ ట్యాంకర్ల చక్కర్లు.. నగరం నలువైపులా శరవేగంగా కొనసాగే రవాణా వ్యవస్థ పనుల్లో ఒక్కసారిగా మందగమనం…నిత్యం కళకళలాడే రియల్ రంగంలో స్తబ్ధత.. ఇలా కేవలం ఐదు నెలల్లోనే వచ్చిన ‘మార్పు’తో నగరవాసి ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల నుంచి స్పందన కనిపించడంలేదని స్పష్టమవుతున్నది. దీనికి తోడు చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లో సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వస్తుండటం ఒక వంతైతే… మల్కాజిగిరిలో ఆ పార్టీ అభ్యర్థికి స్థానికత అంశం కలవరపెడుతున్నది. దీంతో ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్కు ముచ్చెమటలు పడుతుంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహిస్తున్న రోడ్షోలతో గులాబీ పార్టీలో జోష్ కనిపిస్తున్నది. ఇక… బీజేపీ అభ్యర్థులకు కేవలం మోదీ జపం మినహా చెప్పుకునేందుకు ఏమీ లేవు.
బీఆర్ఎస్ నుంచి రంజిత్రెడ్డిని గుంజుకొని చేవెళ్ల టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల అభిష్టాన్ని తెలుసుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం రంజిత్రెడ్డిని బరిలోకి దింపడంపై సొంతగూటిలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సాక్షాత్తూ సీఎం రేవంత్రెడ్డి..సమన్వయం కుదిర్చేందుకు ప్రయత్నించినా.. క్షేత్రస్థాయిలో వస్తున్న సహాయ నిరాకరణ రంజిత్రెడ్డికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే రంజిత్రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్తే.. గ్రామాల్లో జనం నుంచి వ్యతిరేకత ఎదురైంది. రైతు భరోసా, పింఛను, తాగు, సాగునీరు రావడం లేదంటూ ప్రచారంలోనే ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భాలు ఉన్నాయి.
మరోవైపు ఇటీవల బాలాపూర్లో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ కావడం ఆ పార్టీని కలవరానికి గురి చేసినట్లు తెలిసింది. జనం లేదనే కారణంతో సీఎం రేవంత్ ఏకంగా రెండు, మూడు గంటల పాటు తన రాకను వాయిదా వేసుకొని వచ్చినా.. కేవలం 2వేల నుంచి 2500 మంది వరకు మాత్రమే రావడం.. ఆ పార్టీ అధిష్టానం స్థాయిలో చర్చకు దారి తీసినట్లు సమాచారం. మొత్తంగా చేవెళ్లలో కాంగ్రెస్ రెండోస్థానం కోసం పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే టాక్ వినిపిస్తున్నది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ బీసీ నేత కావడంతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అత్యధిక బీసీ ఓటర్లు ఏకతాటిపైకి వచ్చి కాసానిని గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహించిన, సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్.. వికారాబాద్ జిల్లా నుంచి సునీతా మహేందర్రెడ్డిని ఇక్కడికి రప్పించి మరీ టికెట్ ఇప్పించారు. దీంతో ఏడు అసెంబ్లీ పరిధుల్లోని ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
పార్టీ జెండాను మోసిన వారిని కాదని.. ప్యారాచూట్ అభ్యర్థిని తీసుకురావడంపై రగిలిపోయారు. ముఖ్యంగా సునీతా మహేందర్రెడ్డి ఉమ్మడి రంగారెడ్డిలో వివిధ హోదాల్లో పని చేసినప్పటికీ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే ప్రాంతాలతో పరిచయాలు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. స్థానికత అంశం సునీతా మహేందర్రెడ్డి ప్రచారంలోనూ ప్రతికూల పరిస్థితులను తెచ్చి పెడుతున్నట్లు ప్రచార సరళిని చూస్తేనే అర్ధమవుతున్నదని కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతున్నారు.
బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి అనే ఇమేజ్ ప్రజల్లో ఉండటంతో గులాబీ ప్రచారానికి మంచి ఆదరణ కనిపిస్తున్నది. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటున్న రోడ్షోలతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతున్నాయి. మహా నగరంలో కేటీఆర్ మార్కు అభివృద్ధి అనేది పదేండ్లలో కనిపించింది. అందుకే కేటీఆర్కు నగర ఓటర్లలో విశేష ఆదరణ ఉండటంతో రోడ్షోలు బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాలకు మార్గం సుగమం చేస్తున్నాయి.
సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా తయారైందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ద్రోహం చేసి.. అధికార బీఆర్ఎస్లోకి వెళ్లిన దానం నాగేందర్… తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ రావడంపై సొంత పార్టీ శ్రేణులే ఆగ్రహంతో ఊగిపోయారు. దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేయడంతో పాటు ఫిరాయింపుపై కాంగ్రెస్ నాయకులే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. దశాబ్దాల పాటు పార్టీ జెండాను మోసిన వారిని వదిలి అధికార దాహంతో పార్టీ మారే దానంకు టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ శ్రేణులే వ్యతిరేకిస్తున్నారు. దీంతో దానం నాగేందర్ ప్రచారాన్నే ఆలస్యంగా ప్రారంభించగా… అనేక చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలే ప్రచారంలో ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇక.. దానం సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన ఖైరతాబాద్లో దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని పార్టీ సమావేశాలకు ఆహ్వానించకపోవడంతో నియోజకవర్గ పార్టీ క్యాడర్ గుర్రుగా ఉన్నది. ఇక… ఇటీవల కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కండువా కప్పుకున్నారే తప్ప.. కాంగ్రెస్ ప్రచారంలో కనిపిస్తున్నట్లు లేదు. పైగా కాంగ్రెస్ క్యాడర్ కూడా వారి చేరికను ఆహ్వానిస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా పార్టీలోని వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకున్నది. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి సభ సాక్షిగా నిలిచింది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో శనివారం ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్కు మద్దతుగా సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రోటోకాల్ పాటించకపోవడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రచార ర్యాలీకి సంబంధించిన బ్యానర్లో మేయర్ ఫొటో లేకపోవడంతో సంబంధిత బ్యానర్ ఫొటోను పార్టీ వాట్సాప్ గ్రూప్లో ఆమె షేర్ చేశారు. ప్రచార బ్యానర్లో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి ఫొటోలు ఎలా మిస్ అవుతున్నాయి? ఇంతకు మేము మీ పార్టీలోనే ఉన్నామా? లేక ఇతర పార్టీలో ఉన్నామా? అని విజయలక్ష్మి అదే గ్రూప్లో ప్రశ్నించారు. మెసేజ్ను గమనించిన గ్రూప్ అడ్మిన్.. వెంటనే విజయలక్ష్మి చాటింగ్ను డిలీట్ చేశారు. అప్పటికే కొందరు స్క్రీన్ షాట్స్ తీసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాంగ్రెస్లో ఐక్యత లేదంటూ నెటిజన్ల నుంచి విమర్శలు వెలువెత్తాయి. ఇక… బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి కూడా నగరానికి ప్రత్యేక ప్రాజెక్టులను తీసుకురావడంలో విఫలమయ్యారు. స్థానిక సమస్యల్ని సైతం పరిష్కరించడంలో కృషి చేయలేదనే అసంతృప్తి ఓటర్లలో నెలకొన్నది.