విపక్షాలపై కేంద్రం కక్ష సాధింపులు
మహారాష్ట్రలో ఎంవీఏ కూటమిలోని
14 మందిపై కేంద్ర సంస్థల దర్యాప్తు
బీజేపీని విమర్శించినందుకు ఫలితం
ముంబై పేలుళ్ల కేసులో 20 ఏండ్ల
తర్వాత తెరపైకి నవాబ్ మాలిక్ పేరు
ఇటీవలే సంజయ్ రౌత్ ఆస్తుల జప్తు
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చిపోయిన ఘటనలను కూడా తిరగదోడతారు. దేనికో ఒకదానికి లింక్ చేస్తారు. దారికొచ్చారా.. సరే. లేకపోతే కుటుంబసభ్యులను కూడా కేసుల్లోకి లాగుతారు. దర్యాప్తు పేరుతో వేధిస్తారు. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఉన్న మహారాష్ర్టే దీనికి నిదర్శనం. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో కనీసం 14 మంది నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు నేతలు అరెస్టు అయ్యారు. ఈ 14 మందిలో చాలా కేసులను ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకనే నమోదు చేశారు. కేంద్ర సర్కారును విమర్శించినందుకు, బీజేపీని తట్టుకొని నిలబడినందుకు ఆ నేతలకు లభించిన ఫలితం ఇది.
వర్ష రౌత్, సంజయ్ రౌత్
శివసేన, రాజ్యసభ ఎంపీ
దర్యాప్తు చేస్తున్న సంస్థలు: ఈడీ, ఐటీ
హెచ్డీఐఎల్ ప్రమోటర్స్ రాకేశ్, సారంగ్ వాద్వా మనీ ల్యాండరింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా సంజయ్ రౌత్ భార్య వర్షకు చెందిన లావాదేవీలను గుర్తించినట్టు ఈడీ ప్రకటించింది. ఈడీ అధికారుల కథనం ప్రకారం.. హెచ్డీఐఎల్ నుంచి ప్రవీణ్ రౌత్ అనే వ్యక్తి ఖాతాలోకి రూ.100 కోట్లు చేరాయి. ప్రవీణ్ రౌత్ భార్య మాధురి నుంచి వర్షకు నగదు ముట్టినట్టు ఆధారాలున్నాయి. ఈ నగదుతో వర్ష దాదర్లో ఫ్లాట్ కొన్నారు. ఈ కేసులో సంజయ్ రౌత్, వర్షరౌత్లపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఇటీవలే రౌత్కు చెందిన 8 స్థలాలు, ఒక ఫ్లాట్ను ఈడీ జప్తు చేసింది.
శరద్ పవార్- ఎన్సీపీ చీఫ్
దర్యాప్తు చేస్తున్న సంస్థ: ఈడీ
మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలోనే శరద్ పవార్ పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో 70 మంది రాజకీయ నాయకులు నిందితులుగా ఉన్నారు. అయితే, తొలుత సిటీ పోలీసులు శరద్ పవార్ పేరును ఈ కేసులో నిందితుడిగా చేర్చనప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు పవార్ పాత్రపైన కూడా దర్యాప్తు చేస్తున్నాయి.
నవాబ్ మాలిక్- ఎన్సీపీ
దర్యాప్తు చేస్తున్న సంస్థలు: ఈడీ, ఎన్ఐఏ
ముంబై పేలుళ్ల కేసుల సూత్రధారి దావూద్ ఇబ్రహీం మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఫిబ్రవరిలో మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ను అరెస్టు చేసింది. 20 ఏండ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో నవాబ్ మాలిక్ పేరు బయటకు రావడం ఇదే తొలిసారి. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్సీబీ తీరును ప్రశ్నించినందుకే నవాబ్ మాలిక్పై ఈ అభియోగాలు మోపారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అజిత్ పవార్- ఎన్సీపీ, డిప్యూటీ సీఎం
దర్యాప్తు చేస్తున్న సంస్థలు: ఈడీ, ఐటీ
ఇరిగేషన్ కుంభకోణం, మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్(ఎంఎస్సీబీ) కుంభకోణంలో అజిత్ పవార్పై ఈడీ దర్యాప్తు జరుపుతున్నది. పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ విభాగం పవార్, ఆయన కుటుంబసభ్యులపై దర్యాప్తు చేస్తున్నది. కాంగ్రెస్ నేత, పీడబ్ల్యూడీ మంత్రి అశోక్ చవాన్కు సంబంధించిన కేసులను కూడా సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలు తిరగదోడాయి. ఆదర్శ్ సీహెచ్ఎస్ కుంభకోణం కేసులో దర్యాప్తు చేపట్టాయి.
అనిల్ దేశ్ముఖ్- ఎన్సీపీ, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి
దర్యాప్తు చేస్తున్న సంస్థలు-ఈడీ, సీబీఐ, ఐటీ
ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అనిల్ దేశ్ముఖ్ను గతేడాది నవంబర్ 2న అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలతో డిసెంబర్ 29న ఈడీ ఆయనపై సప్లిమెంటరీ చార్జిషీట్ను ఫైల్ చేసింది. మరో అవినీతి కేసులో అనిల్ దేశ్ముఖ్పై ఐటీ దర్యాప్తు జరుగుతున్నది. మంత్రి పదవిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.
అనిల్ పరబ్-ఎన్సీపీ, మహారాష్ట్ర రవాణా మంత్రి
దర్యాప్తు చేస్తున్న సంస్థలు: ఈడీ, సీబీఐ, ఐటీ
మహారాష్ట్రలో పోలీసు అధికారుల ట్రాన్స్ఫర్ల అంశంలో అనిల్ దేశ్ముఖ్పై నమోదైన కేసుకు సంబంధించి అనిల్ పరబ్ పాత్రపైనా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. అనిల్ పరబ్కు చెందిన, లెక్కల్లో చూపని రూ.6 కోట్ల లావాదేవీలను గుర్తించినట్టు ఐటీ విభాగం మార్చిలో ప్రకటించింది.