గువాహటి : అసోంలో టీ తేయాకు తోట కార్మికులపై కరోనా పంజా విసురుతోంది. దిబ్రుఘర్ జిల్లాలోని జలోని టీ ఎస్టేట్లో ఇప్పటి వరకు సుమారు 133 మంది కార్మికులు వైరస్కు పాజిటివ్గా పరీక్షించారు. దీంతో అధికారులు తేయకు సేకరణను నిలిపివేశారు. డిప్యూటీ కమిషనర్ పల్లవ్ గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు 133 మంది కార్మికులు వైరస్కు పాజిటివ్గా తేలారని, అయితే ఎవరికీ లక్షణాలు లేవని తెలిపారు. ఎస్టేట్ను కంటైనేషన్ జోన్గా ప్రకటించినట్లు చెప్పారు. గార్డెన్ పరిసరాలను శానిటైజ్ చేసి, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. తేయాకు తోటలకు సమీపంలో ఉన్న వారాంతపు సంతలను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అసోంలో ప్రస్తుతం 31,262 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,40,004 మంది కోలుకోగా.. 1,485 మంది ప్రాణాలు కోల్పోయారు.