Artificial Intelligence | న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ).. నేటి టెక్ యుగంలో ఇదో సంచలనం. అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఏఐ నాంది పలికింది. అయితే ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దీనితో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలూ అన్నే ఉన్నాయి. ఏఐ రాకతో అనేక మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంపై దీని ప్రభావం అధికంగా ఉన్నది. ఏఐ, ఆటోమేషన్ వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడుతున్నది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు మారడమో లేదా కొత్త అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ కావడమో, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడమో చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. గతంలోనూ పలు కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చిన సమయంలోనూ ఇలాంటి సందర్భాలు చూశామని గుర్తుచేస్తున్నారు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎంఎస్) రావడంతో హెచ్టీఎంఎల్పై ప్రత్యేకంగా పనిచేసే ‘వెబ్మాస్టర్స్’ అనే రోల్స్ కనుమరుగైన విషయాన్ని చెబుతున్నారు.
భవిష్యత్తుల్లో దాదాపు 40 కోట్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని, ఇది మొత్తం ప్రపంచ శ్రామిక శక్తిలో 15 శాతమని మెకిన్సే నివేదిక అంచనా వేసింది. మన దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా ఉన్న ఐఐటీల విద్యార్థులు కూడా ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు పొందడం గగనంగా మారింది. డాటా సేకరణ, డాటా ప్రాసెసింగ్కు సంబంధించిన ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ క్రమంగా పడిపోతున్నది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలు తాజా పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉండనున్నాయి. ప్రతి ఏటా జాబ్మార్కెట్లోకి ప్రవేశించే లక్షలాది మంది యువతకు ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది.
టెక్నాలజీ అభివృద్ధి, విస్తరణ అనేది నిరంతరాయంగా కొనసాగుతుంది. అయితే ఏఐతో కోల్పోయే ఉద్యోగాలు విషయం అటుంచితే.. మరోవైపు కొన్ని ఇతర రంగాల్లో ఉద్యోగాల సృష్టి జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణ, ఆరోగ్య రంగం, గ్రీన్ ఎనర్జీ, శక్తి పరివర్తన, ఇతర డీప్ టెక్ డొమైన్స్లో కొత్తగా 80 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఇది ప్రపంచ శ్రామిక శక్తికి 21-33 శాతం వరకు జోడిస్తుందని చెబుతున్నారు. మరోవైపు భారత్లో ప్రస్తుతం దాదాపు 3 వేలకు పైగా ఉన్న డీప్ టెక్ స్టార్టప్ల(ఇంజినీరింగ్లో హైటెక్ ఆవిష్కరణలు లేదా గణనీయ శాస్త్రీయ పురోగతి ఆధారిత వ్యాపార నమూనా గల సంస్థలు) సంఖ్య 2030 నాటికి 10 వేల దాటుతుందని నాస్కామ్ అంచనా వేసింది.