Lok Sabha Elections | న్యూఢిల్లీ, మే 12: లోక్సభ ఎన్నికల నాలుగో దశకు రంగం సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ర్టాలు/యూటీల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరుగనున్నది. వీటితోపాటుగా ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, అదేవిధంగా ఒడిశాలో అసెంబ్లీకి తొలి దశలో భాగంగా 28 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది.
తెలంగాణలోని మొత్తం 17, ఏపీలోని 25 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలో 13, బీహార్-5, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఒడిశా-4, పశ్చిమబెంగాల్-8, జమ్ముకశ్మీర్లో ఒక్క స్థానం చొప్పున సోమవారం పోలింగ్ జరుగున్నది. 96 లోక్సభ స్థానాల్లో మొత్తం 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 17.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.73 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
బరిలో పలువురు ప్రముఖులు
ఈ లోక్సభ ఎన్నికల విడతలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ యూపీలోని కన్నౌజ్ నుంచి పోటీచేస్తున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, టీఎంసీ ఫైర్ బ్రాండ్ మహు వా మొయిత్రా, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నిత్యానంద్ రాయ్, పంకజ ముండే, తదితర నేతలు భవితవ్యం ఈ దశ ఎన్నికల్లో తేలనున్నది. లఖింపూర్ హింసాకాండలో నిందితుడైన అశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తిరిగి అదే స్థానం నుంచి పోటీచేస్తున్నారు. కాగా, 543 సీట్లు ఉండే లోక్సభలో ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో 283 స్థానాల్లో(52 శాతం) పోలింగ్ పూర్తయింది.