హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సహాయం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) డీజీ శిఖాగోయెల్ చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాలయం గురువారం నిర్వహించిన జాతీయస్థాయి ‘ప్రగతి’ సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారని ఆమె తెలిపారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం రూపొందించిన డిజిటల్ వేదికల వినియోగం, పనితీరు ఆధారంగా తెలంగాణ ఈ ఘనత సాధించిందని వివరించారు. దేశంలోనే తొలి సైబర్ కమాండ్ సెంటర్ (ఎస్4సీ)ను ఏర్పాటు చేయడం, ఈ-జీరో ఎఫ్ఐఆర్ అమలుతోపాటు కీలక ఐ4సీ పోర్టళ్లను సమర్థంగా వినియోగించుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను పీఎంవో సమీక్షలో ప్రత్యేకంగా ప్రశంసించారని తెలిపారు. బాధితులు తమ ఫిర్యాదులు, రీఫండ్లకు సంబంధించిన వివరాలను తెలుసుకొనేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ 8712665600ను అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించారు.