పంటల సాగుకు అక్కరకొచ్చే రైతుబంధు సాయాన్ని సకాలంలో కాకుండా.. సీజన్ ముగిశాక ఇస్తే తామేం చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటలు చేతికొచ్చాక పెట్టుబడిని అందిస్తే ప్రయోజనమేముంటుందని ప్రశ్నలు సంధిస్తున్నారు. అప్పటికే పంటలమ్మిన నగదు తమ చేతికొచ్చాక రైతుబంధు ఇస్తే ఎలా ఉపయోగించుకోవాలని అడుగుతున్నారు. రైతుబంధుకు పరిమితులు విధిస్తామని, కోతలు పూర్తయ్యాక సాయం అందిస్తామని, ఐదెకరాల లోపు వారికే పంటల పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని కొంతకాలంగా ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు ఆయా సభల్లో చేస్తున్న ప్రకటన పట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజన్కు ముందు సాయం అందించకపోతే విత్తనాలు ఉద్దెరకెవరిస్తరని, పై మందుకు పైసలెవలిస్తరని ప్రశ్నిస్తున్నారు. రైతుబంధుకు కోత పెడితే కాంగ్రెస్ సర్కారు వాత తప్పదని హెచ్చరిస్తున్నారు. రైతుబంధు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే రూల్స్ ఉంటే సహించబోమని స్పష్టం చేస్తున్నారు. ఆయా ప్రశ్నలు, అభిప్రాయాలు వారి మాటల్లోనే..
రైతుబంధు సాయాన్ని సీజన్ సమయంలో కాకుండా ఆ తరువాత ఇస్తే మాలాంటి రైతులం ఇబ్బందులు పడతాం. ఇప్పటి వరకూ కచ్చితంగా సీజన్కు ముందే అందిన రైతుబంధు సాయం ఇటీవలి యాసంగిలో సమయానికి అందలేదు. దీంతో అప్పుల కోసం పరుగులు పెట్టాం. అవి కూడా సకాలంలో అందకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పంటల సాగు కూడా కొంత ఆలస్యమైంది. ఇకముందు కూడా రైతుబంధు సాయాన్ని సకాలంలోనే అందించాలి. అప్పుడు సాగు సక్రమంగా, సమృద్ధిగా ఉంటుంది. లేకుంటే అన్నదాతల పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది.
గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా సీజన్కు ముందే రైతులందరికీ రైతుబంధు సాయం అందజేయాలి. సాగు పనులు మొదలుపెట్టే ముందు ఇస్తే వాటితో మొదట విత్తనాలు కొనుక్కుంటాం. మిగిలిన నగదును తరువాత పురుగుమందులకు, ఎరువులకు వినియోగించుకుంటాం. ఇప్పటిదాకా కేసీఆర్ ప్రభుత్వం ఇలాగే ఇచ్చింది. దీంతో పంటల సాగుకు ఇబ్బందులు రాలేదు. కానీ ఇకముందు అలా ఇవ్వబోమని, పంటలు చేతికొచ్చాకే రైతుబంధు ఇస్తామని మంత్రులు అంటున్నారు. అది కూడా కొందరు రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు. రైతులకు అందించే పంటల సాయం విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెట్టొద్దు. కొందరికే రైతుబంధు’ అనే మంత్రుల మాటలు సరికాదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా రైతులందరికీ పథకాన్ని వర్తింపజేయాలి.