ఖమ్మం, మే 19: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం జరుగనున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను విజయంతం చేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి జిల్లాలో ఆయన ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మంలలో జరిగే ఈ ప్రచారానికి పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. బ్యాలెట్ పేపర్లోని మూడో క్రమ సంఖ్యలో రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతుడు రాకేశ్రెడ్డి అని గుర్తుచేశారు. సేవ చేయాలనే ఉన్నతాశయంతోనే అతడు రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. చట్టసభల్లో పట్టభద్రుల గొంతు వినిపించేందుకు రాకేశ్రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.