నల్గొండ జిల్లా: రైతులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం నార్కెట్పల్లి పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ను చిరుమర్తి లింగయ్య తనిఖీ చేసి, లాగ్బుక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
‘‘కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అందిన విద్యుత్ కంటే మెరుగైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు అప్పుల పాలవుతున్నారు. లాగ్బుక్లో కరెంట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయిందనే వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం ఆందోళనకరం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనిఖీకి వస్తున్నారని తెలిసి కూడా వివరాలు నమోదు చేయకపోవడం సిగ్గుచేటు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు.. ఎక్కడైనా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్న ప్రాంతాన్ని చూపించే దమ్ముందా?
రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకుని, విద్యుత్ సరఫరాలో ఉన్న సమస్యలను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి. రైతు సంక్షేమమే లక్ష్యంగా.. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.