ఖమ్మం, మే 19 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే పార్టీ అభ్యర్థి విజయం కోసం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికే కదనరంగంలోకి దిగి పని చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్లు హైదరాబాద్లోని తెలంగాణభవన్లో ఖమ్మం జిల్లా పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
శాసనమండలి ఎన్నికలకు నేతలను సమాయత్తం చేశారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తదితర నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం పార్టీ నాయకులందరూ తీవ్రంగా శ్రమించారు. అదే స్ఫూర్తితో నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించాలని కేసీఆర్, కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థి రాకేశ్రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయనున్నారు.
ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ప్రచారం చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఇల్లెందు పట్టణానికి చేరుకుంటారు. అక్కడి జేకే గ్రౌండ్స్లో పట్టభద్రులతో సమావేశమవుతారు.
మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ కు చేరుకుంటారు. అక్కడ కూడా పట్టభద్రులతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్బీఐటీ కాలేజీకు చేరుకున్నారు. ఆ కళాశాల ప్రాంగణంలో పట్టభద్రులతో జరిగే సమావేశానికి హాజరవుతారు.