న్యూఢిల్లీ : నిత్యం ఎంతో మందిని గ్యమస్థానాలకు చేర్చే రైలు బోగీలు మళ్లీ ఐసోలేషన్ వార్డులుగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి మొదటి విడుతలో ఆసుపత్రుల్లో బెడ్ల కొరతతో కోచ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చింది. సెకండ్ వేవ్లో కరోనా పంజా విసురుతుండడంతో ఇప్పటికే రాష్ట్రాల్లోని హాస్పిటళ్లలో పడకలు నిండిపోయాయి. ఈ క్రమంలో మరోసారి రైల్వే ముందుకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో 3,816 రైల్వే కోచ్లను కొవిడ్-19కేర్ కోచ్లుగా మార్చినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు కోచ్లను మోహరిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.
మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో 21 కొవిడ్ -19 కేర్ కోచ్లను మోహరించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. షుకుర్ బస్తీ వద్ద 25, ఆనంద్ విహార్లో 25, వారణాసిలో 10, భడోహిలో పది, ఫైజాబాద్ వద్ద 10 కొవిడ్-19 కేర్ కోచ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాల్లో భాగంగా మొత్తం 5,601 రైల్ కోచ్లను కొవిడ్ కేర్ సెంటర్లుగా మారుస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం 3,816 కోచ్లు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. తేలిక పాటి కరోనా రోగులకు సేవలందించేందుకు ఉపయోగించుకోవచ్చని చెప్పింది.
ఇవికూడా చదవండి..