ముంబై, ఏప్రిల్ 24: కేంద్రం ప్రకటించిన మూడో విడుత వ్యాక్సినేషన్లో తమ టీకా కొవిషీల్డ్ ధరల పెంపును సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమర్థించుకొన్నది. టీకా తయారీకి చాలా దేశాలు రిస్క్ తీసుకొని కంపెనీకి నిధులు సమకూర్చాయని, అందుకే ఇండియాతో సహా ఆయా దేశాలకు తొలుత టీకా సరఫరా చేశామని అప్పుడు ధరను రూ.150గా నిర్ణయించామని పేర్కొన్నది. ప్రస్తుతం కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ డోసులు తయారు చేయడం అనివార్యమని, అందుకు పెట్టుబడుల కోసం ధరను పెంచామని తెలిపింది. భారత్లో కొవిషీల్డ్ ధరలను ప్రపంచదేశాల్లోని ధరలతో పోల్చి చూడలేమని చెప్పింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన టీకాల్లో కొవిషీల్డ్ ఒకటని సమర్థించుకొన్నది.
భారత్లో కొవిషీల్డ్కు నిర్ణయించిన రూ.600 ధర ప్రపంచంలోనే మరెక్కడా లేదని విమర్శలు వస్తున్నాయి. భారత్ తర్వాత అత్యధికంగా సౌదీ అరేబియాలో 5.25 డాలర్లుగా ఉంది. అమెరికాలో కరోనా టీకా ధర 4 డాలర్లు, యూకేలో 3 డాలర్లుగా ఉంది.
కాన్పూర్: పరమవీర చక్ర అవార్డు గ్రహీత, 1965లో పాక్తో యుద్ధంలో వీరోచితంగా పోరాడిన యోధుడు అబ్దుల్ హమీద్ కుమారుడు అలీహసన్(61) వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడు. దగ్గు, శ్వాస సమస్యలతో యూపీలోని కాన్పూర్లో లాలా లజపతిరాయ్ దవాఖానలో చేరిన హసన్కు వైద్యులు కొవిడ్ పరీక్షలు చేసి సరైన చికిత్స అందించి ఉంటే బతికేవాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. అలీహసన్ అనారోగ్యంతో బుధవారం దవాఖానలో చేరాడు. శుక్రవారం చనిపోయాడు.