ఢాకా : రెండు పడవలు ఢీకొట్టుకున్న ఘటనలో 25 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఈ సెంట్రల్ బంగ్లాదేశ్లోని పద్మ నది వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో ఐదుగురిని రక్షించామని, 25 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీస్ చీఫ్ మిరాజ్ హుస్సేన్ తెలిపారు. షిబ్చార్ పట్టణానికి సమీపంలోని పద్మ నదిలో సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవను ఇసుక రవాణా చేస్తున్న ఓడ ఢీకొట్టింది.
విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించి, పలువురిని రక్షించే ప్రయత్నం చేస్తుండగా ఎక్కువ మంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. బంగ్లాలో పడవ ప్రమాదాలు సర్వ సాధారణం. పేలవమైన నిర్వహణ, షిప్యార్డుల వద్ద భద్రతా ప్రమాణాల లేమి, రద్దీ సైతం ప్రమాదాలకు కారణమని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభంలోనూ సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవను పెద్ద కార్గో ఓడ ఢీకొట్టింది. గతేడాది జూన్లో ఫెర్రీ మునిగిపోయి 32 మంది మరణించారు. 2015 ఫిబ్రవరిలో కార్గో బోటును ఢీకొట్టడంతో కనీసం 78 మంది మరణించారు.