తెలంగాణ మేధోప్రపంచంలో ఒక ధ్రువతార, చరిత్ర పరిశోధనా రంగంలో అజరామరమైన ముద్ర వేసిన మహనీయుడు, ఉద్యమ సిద్ధాంత, ఆలోచనాపరుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య జీవన ప్రస్థానం అసాధారణం. 85 ఏండ్ల వయస్సులో జగిత్యాలలోని తన స్వగృహంలో ఆయన కన్నుమూయడం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్రలో ఒక మహోజ్వల అధ్యాయం ముగియడమే. చరిత్రను కేవలం గతాన్వేషణగా కాకుండా, వర్తమాన చైతన్యానికి, భవిష్యత్ నిర్మాణానికి పునాదిగా భావించిన అరుదైన దార్శనికుడు ఆయన. జగిత్యాల గడ్డపై జన్మించి, ఆ ప్రాంతం నుంచి మొట్టమొదటి పీహెచ్డీ పట్టా పొందిన పరిశోధకుడిగా రమణయ్య సృష్టించిన చరిత్ర అజరామరం.
‘సౌత్ ఇండియా టెంపుల్స్’ (దక్షిణ భారత దేవాలయాలు) అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల శిల్పకళ, శాసనాలు, నిర్మాణ శైలిపై ఆయన చేసిన విశ్లేషణలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఆలయాలను కేవలం మతపరమైన కోణంలో కాకుండా, ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకు ప్రతిబింబాలుగా ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతమైనది. 1971లో సిద్దిపేట జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన రమణయ్య, విద్యార్థుల్లో కేవలం సబ్జెక్టు పట్ల ఆసక్తిని మాత్రమే కాదు, ప్రాంతీయ అస్తిత్వం పట్ల మక్కువను కూడా కలిగించారు. ఆ కాలంలో ఆయన వద్ద విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ఒకరైన తెలంగాణ మలి ఉద్యమ సారథి, తెరాస అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపై రమణయ్య ప్రభావం అత్యంత గాఢమైనది.
తెలంగాణ భూమిపుత్రుల ఆవేదన, ఈ ప్రాంత గొప్పతనం, చారిత్రక అన్యాయాలను ఆయన తరగతి గదిలో బోధించిన తీరు కేసీఆర్ వంటి నాయకుడి ఆలోచనా ధోరణిని మలిచింది. అందుకే తెలంగాణ రాజకీయ యవనికపై కేసీఆర్ సాధించిన విజయాల వెనుక రమణయ్య మార్గదర్శకత్వం, సిద్ధాంత బలం ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు.
రాజకీయాధికారం కంటే సామాజిక విముక్తి ముఖ్యమని నమ్మిన జైశెట్టి కేసీఆర్కు రాజకీయ గురువుగా గుర్తింపు పొందడం తెలంగాణ చరిత్రలో ఒక కీలక ఘట్టం. రమణయ్య పరిశోధనల్లో శాస్త్రీయత, నిబద్ధత ఉట్టిపడతాయి. తెలంగాణ చరిత్రను విస్మరించిన పాలకుల కాలంలో, ఈ గడ్డపై ఉన్న ప్రతి శిలాశాసనాన్ని, ప్రతి ప్రాచీన కట్టడాన్ని ఆయన స్వయంగా సందర్శించి ప్రాణప్రతిష్ఠ చేశారు. నిజాం కాలపు భూస్వామ్య వ్యవస్థలో రైతులు అనుభవించిన వెతలు, అణచివేతకు గురైన తెలంగాణ సంస్కృతిని ఆయన తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన అందించిన చారిత్రక సాక్ష్యాలు, గణాంకాలు ఉద్యమకారులకు గొప్ప ఆయుధాలుగా మారాయి. స్వీయ గుర్తింపు లేని జాతి మనుగడ సాగించలేదని నమ్మిన ఆయన, తెలంగాణ భాష, యాస, సంప్రదాయాల పరిరక్షణే పరమావధిగా జీవించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, గ్రామీణ వృద్ధుల నుండి మౌఖిక చరిత్రను సేకరించడం ఆయనకున్న పరిశోధనా తృష్ణకు నిదర్శనం.
ప్రజాస్వామిక విలువల పట్ల గట్టి నమ్మకం ఉన్న రమణయ్య, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విశ్రమించలేదు. రాష్ట్ర అభివృద్ధిలో సామాజిక న్యాయం, విద్య, సాంస్కృతిక పునరుజ్జీవనం ఎలా ఉండాలో నిరంతరం సూచిస్తూనే వచ్చారు. ఆయన వ్యక్తిత్వంలోని సరళత, నిరాడంబరత అశేష శిష్యకోటికి ఆదర్శం. ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా, తన స్వస్థలమైన జగిత్యాల పట్ల, అక్కడి మట్టి పట్ల ఆయనకున్న మమకారం వీడలేదు. ఒక చరిత్రకారుడిగా ఆయన మిగిల్చిన గ్రంథాలు, విశ్లేషణలు రాబోయే పరిశోధకులకు దిక్సూచి వంటివి. చరిత్ర అంటే కేవలం రాజుల కథలు కావని, అది సామాన్య ప్రజల జీవన చిత్రమని నిరూపించిన డాక్టర్ జైశెట్టి రమణయ్య మరణం తీరని లోటు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, తెలంగాణ అస్తిత్వ పోరాటంలో ఆయన రగిల్చిన జ్ఞానదీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఆ మహనీయుని స్మృతికి నివాళి అర్పించడం అంటే ఆయన ఆశయాలను, తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు సగర్వంగా అందించడమే.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్ )
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494