సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని ఈనెల 18 నుంచి అమలు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. మంగళవారం బంజారాహిల్స్లోనికమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్తో కలిసి సీపీ వివరాలను వెల్లడించారు. హెచ్-సిటీ ప్రాజెక్ట్లో భాగంగా చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులతో రహదారి విస్తీర్ణం తగ్గిపోవడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని, ప్రమాదాలకు అవకాశం ఉందని సీపీ తెలిపారు.
ప్రయాణికుల భద్రత, సాఫీ ప్రయాణం కోసం ఈనెల 18 నుంచి వన్వే విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వన్ వే ట్రాఫిక్తో ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేలా ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వన్వే మార్గాలకు అనుగుణంగా వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని, అంబులెన్స్, ఫైర్ ఇంజన్ల వంటి అత్యవసర వాహనాల కోసం లేన్-2 ద్వారా ఆటంకం లేని మార్గాన్ని కల్పించాలని కోరారు. కేబీఆర్ పార్కు వాకర్లు, సందర్శకులు నిర్థేశిత ప్రాంతాల్లోనే తమ వాహనాలను పార్కు చేయాలని సూచించారు.