న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనం వెలుపల మంగళవారం ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు ఎన్డీఏ ఎంపీలు పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలో విద్యార్థి నిరసనకారులపై జరిగిన పోలీసుల లాఠీచార్జ్ మీద వివరణ ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా భయపడ్డారని, ఆయన పార్లమెంట్కు రావాలని, అలాగే అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాల నిరసనల కారణంగా ఉభయసభల్లో చర్చ జరగకుండా రాహుల్ గాంధీ పారిపోతున్నారంటూ అధికార పక్ష ఎంపీలు కౌంటర్ నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ భాగ్యస్వామ్య పక్షంగా ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వ పాలనలోని జార్ఖండ్లో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం రాహుల్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని వారు ఆరోపించారు. పార్లమెంట్లో విద్యార్థుల నిరసనలపై మాట్లాడేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
దీనిపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ మాట్లాడుతూ, అమిత్ షా అభిప్రాయాన్ని వినేందుకు ప్రతిపక్షాలు ఆసక్తిగా లేవని, పోలీసు అణచివేత వెనుక ఎవరున్నారనే దానిపై మాత్రమే స్పష్టమైన సమాధానం కావాలని కోరారు. సభలోనిరసనలు కొనసాగుతుండటంతో లోక్సభ నిరవధిక వాయిదాల పరంపర కొనసాగింది. తిరిగి సభ ప్రారంభమయ్యాక ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించిందని, ఇతర అంశాలపై కూడా చర్చ జరుగుతుందని, అందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. కాగా ప్రియాంక గాంధీ పార్లమెంట్కు చేరుకున్న సమయంలో బీజేపీ ఎంపీ ముఖేష్ దలాల్ మాట్లాడుతూ ‘రాహుల్గాంధీ సిగ్గు పడాలి’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రియాంక గాంధీ చిరునవ్వుతో ఆ ఎంపీ దగ్గరకు వచ్చి, రాహుల్ ఇప్పటికే జార్ఖండ్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలిశారని బదులిచ్చారు. దీంతో ఆయన మీరు కూడా జార్ఖండ్ వెళ్లండి అని అన్నారు. తరువాత ఆమె నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష ఎంపీలతో చేతులు కలిపారు. కాగా జార్ఖండ్లో విద్యార్థులపై లాఠీచార్జీపై రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలంటూ అక్కడ బ్యానర్లు కనిపించాయని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. జార్ఖండ్ యువతకు న్యాయం జరగాలి. వారిపై లాఠీచార్జీలు, అరాచకాలకు పాల్పడిన తీరు రాహుల్ ఆలోచనలను బట్టబయలు చేస్తున్నదని ఠాకూర్ ఆరోపించారు.
36 నిమిషాల్లో ఏడు బిల్లులకు ఆమోదం
వర్షాకాల సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం మొత్త మీద 19 బిల్లులను ఆమోదించుకోగలిగింది. ఎలాంటి చర్చ లేకుండా ఈ బిల్లులన్నీ ఆమోదం పొందాయి. ఒక దశలో కేవలం 36 నిమిషాల్లో ఏడు బిల్లులు ఆమోదం పొందాయి. అంటే సగటున ప్రతి ఐదు నిమిషాలకు ఒక బిల్లు చొప్పున ఆమోదించారు.