అగర్తలా: త్రిపురలోని అంబస్సా వద్ద ఉన్న తాత్కాలిక కొవిడ్ సంరక్షణ కేంద్రం నుంచి 25 మంది రోగులు తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో ఏడుగురిని రైల్వే స్టేషన్ వద్ద పట్టుకోగలిగారు. పంచాయతీ రాజ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (పీఆర్టీఐ)లోని కొవిడ్ కేర్ సెంటర్ నుంచి పారిపోయిన రోగులందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు అని అంబస్సా పోలీస్స్టేషన్ ఇన్చార్జి హిమాద్రి సర్కార్ పేర్కొన్నారు. రైల్వే, ఇతర అధికారులను అప్రమత్తం చేసి, వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించామన్నారు.
18 మంది రోగులు రైలు ఎక్కి రాష్ట్రం విడిచి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెల ఏప్రిల్ 22న సైతం 31 మంది కొవిడ్ రోగులు అగర్తాలాలోని అరుంధతీనగర్ ప్రాంతంలోని కేర్ సెంటర్ నుంచి తప్పించుకున్నారు. త్రిపుర స్టేట్ రైఫిల్స్ (టీఎస్ఆర్)లో నియామకాల కోసం ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. వారిని ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రజలు కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ను తీసుకురావడం త్రిపుర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.