న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కోరలు చాచినా నాగుపాములా బుసలు కొడుతోంది. చిన్న పిల్లాడి నుంచి వృద్ధాప్యం వరకు అందరినీ కరోనా బలి తీసుకుంటోంది. 24 గంటల పాటు వైద్య సేవలందించే వైద్యులను సైతం కరోనా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఓ దంత వైద్యురాలికి కరోనా సోకడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఢిల్లీకి చెందిన డాక్టర్ డింపుల్ ఆరోరా చావ్లా(దంత వైద్యురాలు) ఏప్రిల్ మొదటి వారంలో కరోనా బారిన పడింది. అప్పుడు ఆమె ఏడు నెలల గర్భిణి. కరోనా సోకడంతో ఆమెలో ఆక్సిజన్ లెవల్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. డాక్టర్లు ఆమెను పరీక్షించగా, కడుపులో ఉన్న బిడ్డ హార్ట్బీట్ సరిగా లేదని, చనిపోయిందని నిర్ధారించారు. ఆ మరుసటి రోజే డింపుల్ ఆరోరా కూడా చనిపోయారు.
అయితే కరోనా వార్డులో చికిత్స పొందుతున్న సమయంలో 20 సెకండ్ల నిడివి గల ఓ వీడియోను డింపుల్ ఆరోరా విడుదల చేశారు.
వీడియో సందేశం ఏంటంటే.. తాను విపత్కర పరిస్థితుల్లో ఈ వీడియో చిత్రీకరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి తాను చెప్పెదొక్కటే. కరోనాను ఎవరూ తేలికగా తీసుకోవద్దు. తాను మాట్లాడలేకపోతున్నాను. కానీ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించండి. బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించండి. మనం కోసం కాకుండా, మనల్ని ప్రేమించే వారి కోసం మాస్కు ధరించండి అని డింపుల్ ఆరోరా ప్రాధేయపడింది. డింపుల్ ఆరోరాకు భర్త, ఓ కుమారుడు ఉన్నారు.