Rahul Sipligunj | టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, బిగ్బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘నాటు నాటు’ పాటతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. విశాఖపట్నంలో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో యువతి పలు తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు సమాచారం. యువతి ఫిర్యాదు ప్రకారం.. కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేశాడని పేర్కొంది.
ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ కూడా తన వద్దకు వచ్చారని యువతి ఆరోపించినట్లు తెలుస్తోంది. రాహుల్ రెడ్డికి బంధువుగా తనను పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారని, తనతో బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు ఇప్పించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తన పరువుకు భంగం కలిగించారని కూడా యువతి ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్తో కలిపి మొత్తం 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మధ్యవర్తిత్వం చేసిన కొందరు వ్యక్తులు, జర్నలిస్టులు, హైకోర్టు న్యాయవాది గీతా ప్రసన్న చందన పేర్లు కూడా కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 16 మందిపై కేసు నమోదైనట్లు సమాచారం.
యువతి ఫిర్యాదు ఆధారంగా బెదిరింపులు, సైబర్ వేధింపులు తదితర ఆరోపణలకు సంబంధించిన కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఎంవీపీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ.. అనంతరం దర్యాప్తు కోసం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు సమాచారం. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. యువతి చేసిన ఆరోపణలు దర్యాప్తులో ఎంతవరకు నిజమన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మరోవైపు రాహుల్ సిప్లిగంజ్పై వచ్చిన ఆరోపణలపై ఆయన నుంచి గానీ, ఆయన కుటుంబ సభ్యుల నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.