చెన్నై : తిరునెల్వేలిలోని సిమెంట్ కర్మాగారంలో తమిళనాడు పోలీసులు బుధవారం ఉదయం రెండు పైపుబాంబులను పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ గుర్తించింది. దీంతో తిరునెల్వేలిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శంకర్నగర్ వద్ద ఉన్న ఫ్యాక్టరీ తమిళనాడు, కేరళకు సిమెంట్ను సరఫరా చేస్తుంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యానికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బాంబులను గుర్తించడంతో కలకలం సృష్టించింది.
యాజమాన్యం బెదిరింపు కాల్పై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే బాంబు డిటెక్షన్ డిస్పోసబుల్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించి, రెండు పైపుబాంబులను గుర్తించింది. దీని వెనుక సిమెంట్ కార్మాగారంలో తొలగించిన కొంత మంది ఉద్యోగుల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల నుంచి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని తిరునెల్వేలి ఎస్పీ మణివన్నన్ పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.