ఢాకా: ఒక బస్సు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. నీళ్లు లేని ఆ కాలువలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో (Bus accident) 16 మంది ప్రయాణికులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్తున్న బస్సు మదారిపూర్లోని కుతుబ్పూర్ ప్రాంతంలో ఉన్న వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ గట్టు గోడను బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు మరణించినట్లు బంగ్లాదేశ్ హైవే పోలీసులు తెలిపారు. 30 మంది గాయపడినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎమద్ పరిబహన్ సంస్థకు చెందిన బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలిపారు. దీంతో ఆ బస్సు కాలువలోకి దూసుకెళ్లి, గట్టు గోడను బలంగా ఢీకొన్నదని చెప్పారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: