హరారే: ఒక స్కూల్లోని క్లాస్రూమ్ భూమిలోకి (School sink) కుంగింది. దీంతో ఆ తరగతి గదిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో 17 మంది గాయపడ్డారు. జింబాబ్వేలో ఈ సంఘటన జరిగింది. ఆ దేశ రాజధాని హరారేకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెక్వేలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే ఈ స్కూల్ సమీపంలో రెండు బంగారు గనులు ఉన్నాయి. ఆ గనుల్లో అక్రమ తవ్వకాల ప్రభావం ఆ స్కూల్పై పడింది. దీంతో గురువారం ఉన్నట్టుండి స్కూల్లోని ఒక క్లాస్రూమ్ భూమిలోకి కుంగిపోయింది. తరగతి గదిలో పెద్ద గొయ్యి ఏర్పడింది. బెంచీలపై కూర్చొన్న విద్యార్థులు వాటితో సహా ఆ గోతిలో పడ్డారు. దీంతో పది నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలిక తీవ్రంగా గాయపడటంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎంపీ జుడిత్ తోబైవా ఆ స్కూల్ను సందర్శించారు. సమీపంలో ఉన్న బంగారు గనుల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తవ్వకాల వల్ల స్కూల్ కుంగిపోతున్నదని ఆమె తెలిపారు. తరగతి గది నేల, బెంచీలు భూమిలోకి కుంగిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇంకా పేలుళ్లు కొనసాగుతున్నాయిని, ఈ ప్రాంతం ఊగిపోతున్నదని పేర్కొన్నారు. ఈ సంఘటనపై వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
మరోవైపు స్కూల్ కుంగిన సంఘటనపై చాలా దిగ్భ్రాంతి చెందినట్లు ప్రాంతీయ వ్యవహారాల మంత్రి లారీ మావిమా తెలిపారు. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు మైనర్లు ఎలాంటి సురక్షితమైన చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రమాదకరంగా మారిన ఆ స్కూల్ను మూసి వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థుల చదువు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
At globe and Phoenix primary where a classroom has collapsed with students inside and so far the number of students hospitalized is now 13.Its not long ago I recommended immediate action after having visited the school and noticed the signs.its important for authorities 2 listen pic.twitter.com/Q2pPBq3EK0
— Hon Judith Tobaiwa (@JudithTobaiwa2) March 16, 2023
Also Read: