హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ)/గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.9 టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. గద్వాల నియోజకవర్గానికి తాగునీరు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఏప్రిల్ 15న జిల్లా కేంద్రంలో జలదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు మద్దతు తెలిపి దీక్షను విరమింపజేశారు. దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఈ నేపథ్యంలో జూరాలకు నీటిని విడుదల చేసి తాగునీటి సమస్య తీర్చాలని సీఎస్ శాంతికుమారి, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా పలుమార్లు కర్ణాటక అధికారులతో చర్చలు జరిపారు. నీటిని విడుదల చేయకపోతే ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం నీటి విడుదలకు అంగీకరించడంతో ఎమ్మెల్యే చేపట్టిన జలదీక్ష ఫలించింది. నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు 1.9 టీఎంసీలను బుధవారం రాత్రి అధికారులు విడుదల చేసినట్టు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు జూరాల డ్యాంకు నీళ్లు చేరే అవకాశం ఉన్నది. నీటి రాకతో పీజేపీ ప్రాజెక్టు నీటి లభ్యతపై ఆధారపడిన మిషన్ భగరథకు నీరు అందనున్నది. కాగా నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాల దాదాపుగా 165 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్నది. నదీ మార్గం ఇప్పటికే ఎండిపోయి ఉండటంతో కర్ణాటక నుంచి విడుదల చేసిన జలాల్లో జూరాలకు చేరేవరకూ దాదాపు 30 శాతం కంటే ఎక్కువగా ఆవిరయ్యే అవకాశం ఉంటుందని ఇక్కడి అధికారులు అంచనా వేస్తునారు.