సంక్షేమంతోపాటు వ్యవసాయాది రంగాల్లో నేడు తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. తాగునీటికి తండ్లాడిన పాలమూరు నేడు సాగునీటి జలకళతో శోభిల్లుతున్నది. పచ్చని పైరు పంటలతో ప్రగతి పాట పల్లకిపై ఊరేగుతున్నది.
రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ సంసృ్కతి, సంప్రదాయాల్లో కూడా ఆత్మగౌరవం నిలబెట్టే అంశాలు కోకొల్లలు. దర్శక, నిర్మాతలు ఒకప్పుడు తెలంగాణ నటులు, రచయితలు, గాయకులను వెలివేసారు. ఇప్పుడు మీరే మా సినిమాకు ఆకర్షణ అంటున్నరు! గతంలో జోకర్లకు, విలన్లకే పరిమితమైన తెలంగాణ భాషను ఈరోజు హీరో, హీరోయిన్లతో మాట్లాడిస్తున్నరు. తెలంగాణ భాషను ఎత్తుకుంటే సినిమాలకు కోట్లలో లాభాలు కురుస్తున్నాయి.
గంగవ్వ మాట్లాడినా, కనకవ్వ పాట పాడినా సినిమావాళ్లు ఈర్ష్యపడేలా సామాజిక మాధ్యమాల్లో కోట్ల లైకులు వస్తున్నయి. పంజాబ్ గజల్స్ పాటలను మించిన యూట్యూబ్ వీక్షకులు తెలంగాణ జానపదానికి ఉండటం గమనార్హం. నాడు ‘జబ్బకు తుపాకి చేతిల సంచి జాతర పోదమా, పోరు జాతర పోదమా’ అన్న యువత ఉత్పత్తి, ఉపాధినిచ్చే పరిశ్రమలకు తెలంగాణ వేదిక కావడంతో తెలంగాణ పల్లె దిక్కు చూస్తున్నరు. సరికొత్త సేవలరంగ అభివృద్ధి, విస్తరణతో తెలంగాణ యువత జబ్బకు ల్యాప్టాప్, చేతిలో టిఫిన్ బాక్స్తో కొలువు జాతర పోతున్నరు.
గోదావరి నీళ్లు తెలంగాణ భూముల్లోంచి పరుగెత్తి చివరికి సముద్రంలో మునిగిపోయేది. సీఎం కేసీఆర్ దార్శనికత జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ అంతటా ఆనకట్టలు కట్టడం వల్ల గోదావరి నీళ్లు నేడు కాళేశ్వరం దేవుడి సన్నిధిలో సేదతీరుతున్నయి. సీమాంధ్ర వలస పాలనలో నీళ్లే కాదు, నిధులను తరలించుకు పోవటంతో మన దగ్గర గతుకుల రోడ్లు ఉండేవి. ఇప్పుడవన్నీ నూనె పోస్తే కారేటి నునుపైన తారు రోడ్లయినయి.
రాష్ట్రంలో వ్యవసాయాధారిత అభివృద్ధి, సంక్షేమం వల్ల ఇప్పు డు ఊళ్ళో రోడ్డుకు అర ఎకరం అమ్మినా అంతస్తుల భవనం నగరంలోనే కట్టుకోవచ్చు. పట్నంలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి హైదరాబాద్లో ఇల్లు ఉన్నోడికి అమ్మాయి దొరకడం కష్టమవుతున్నది. కానీ ఊరులో ఏ మూలనో రెండెకరాల భూమి ఉన్న అబ్బాయికి పట్నం నుంచి వచ్చి పిల్లనిస్తున్నరు.
గతంలో మౌలిక వసతుల అభివృద్ధి హైటెక్ సిటీ కేంద్రంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ చుట్టే తిరుగుతే, నేడు అలాంటి అభివృద్ధి గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ తిరగడమే కాకుండా, ఇతర నగరాలైన వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ, సిద్దిపేటలకు విస్తరించింది. ఆ నగరాలన్నీ సమ్మిళిత అభివృద్ధి చెందుతున్నయి. ఇవ్వాళ తెలంగాణ పల్లె సీమలన్నీ సంతోషాల లోగిళ్ళు అయినయి. వృద్ధులంతా ప్రభుత్వ పింఛన్తో ఆత్మగౌరవంతో జీవిస్తున్నరు. ఆసరా పింఛన్లతో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇంటింటా పెద్ద కొడుకులా భావిస్తున్నరు. నాణ్యమైన విద్య, వసతి, మంచి భోజనం ఏర్పాటుచేయడం వల్ల ప్రభుత్వ బడులన్నీ కళకళలాడుతున్నయి. గురుకులాల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులంతా నాణ్యమైన విద్యను పొందుతున్నరు. గతం లో ప్రభుత్వ బడులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ హాస్టళ్లంటేనే ఈసడించుకున్నవారిప్పుడు వాటికోసం బారులు తీరుతున్నరు.
గతంలో ‘గంగదేవిపలె’్లను గ్రామ సర్వతోముఖాభివృద్ధికి చిహ్నంగా చూపేవారు. ఈ రోజు తెలంగాణలోని ప్రతి పల్లె అభివృద్ధికి చిరునామాగా మారింది. ప్రకృతి వనాలు, గ్రామ సచివాలయాలు, అంతర్గత రహదారులు, మరుగుదొడ్లు, శ్మశానవాటికలు నెలకొన్నాయి.
గతంలో గుక్కెడు నీళ్లు లేక, ఫ్లోరిన్ సమస్యతో సతమతమైన తెలంగాణలో నేడు మిషన్ భగీరథతో తాగునీటి సమస్య తీరింది. ఇంటింటికీ పరిశుభ్రమైన గోదావరి, కృష్ణా నదుల నీళ్లు నల్లాల ద్వారా సరఫరా అవుతున్నయి. మార్చి, ఏప్రిల్ నెలలు వచ్చాయంటే కరెంటు కోతతో గోసపడేది. ఇప్పుడు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటుతో పల్లెలు వెలుగులు చిమ్ముతున్నయి. ఇట్లా అన్నిరంగాలను, వ్యవస్థను బలోపేతం చేస్తున్న కేసీఆర్ ప్రభు త్వం ఇవ్వాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అనతికాలంలోనే ఈ ఘనత సాధించిన తెలంగాణకు కేంద్రం అన్నివిధాలా అండ గా నిలువాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్తలు: డా.భైరి నిరంజన్, డా.రంగారెడ్డి (కాకతీయ), డా.పరుశురామ్ మాదిగ, డా.రజిని (ఉస్మానియా), డా. ఎ.వంశీకృష్ణా రెడ్డి (జేఎన్టీయూ), డా. పాండ్రంగ్ యాదవ్ (మహాత్మాగాంధీ), డా.ఖాజా మొయినుద్దీన్ (పాలమూరు), డా.తిరుపతిరెడ్డి (శాతవాహన), డా. నరేందర్ ముదిరాజ్ (ఫైన్ ఆర్ట్స్), డా.సతీష్గౌడ్ (ఐఐటీ బాసర) విశ్వవిద్యాలయాల సహాయాచార్యులు (యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ (ఉథాట్స్))