రోజౌ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో డొమినికాలో అరెస్టయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. డొమినికా జైలులో ఉన్న ఆయన ఫొటోలను ఆంటిగ్వా న్యూస్ రూమ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో ఛోక్సీకి చేతికి, ఎడమ కంటికి గాయాలు, వాపు ఉండడం కనిపిస్తోంది. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో మెహుల్ ఛోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోదీ కీలక నిందితులుగా ఉన్నారు. రూ.13,500 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉండగా.. మోసం వెలుగులోకి వచ్చే ముందే ఆయన ఆంటిగ్వా పౌరసత్వం తీసుకొని అక్కడికి పారిపోయారు.
నీరవ్ మోదీ లండన్కు పరారయ్యాడు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛోక్సీని దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గత ఆదివారం ఆంటిగ్వాలో కనిపించకుండా పోగా.. ఈ నెల 25 కరేబియన్ దీపంలోని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కొంతమంది వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారని ఛోక్సీ చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది వేన్ మార్ష్ ఆరోపించారు. చాలా సార్లు ప్రయత్నించిన తర్వాత ఛోక్సీతో వీడియో కాల్లో మాట్లాడేందుకు అధికారులు అంగీకరించారని తెలిపారు. ఆయన్ని తీవ్రంగా కొట్టినట్లు అనిపిస్తుందని, కళ్లు ఉబ్బిపోయానని, ఒంటిపై కాలిన గాయాలున్నాయని తెలిపారు.
ఆంటిగ్వాలోని జాలీ హార్బర్ వద్ద నుంచి కొంతమంది వ్యక్తులు తనను బలవంతంగా లాక్కొని ఓ బోటులో డొమినికా తీసుకొచ్చారని ఆయన నాతో చెప్పారని.. వారు భారత్, ఆంటిగ్వా పోలీసులు అయి ఉంటారని ఛోక్సీ అనుమానిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయవాదులు డొమినికాలో హేబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తూర్పు కరేబియన్ సుప్రీంకోర్టు శుక్రవారం ఛోక్సీకి తన న్యాయవాదిని కలవడానికి, వైద్య పరీక్షల కోసం అనుమతి ఇచ్చింది. అలాగే ఛోక్సీని భారత్కు అప్పగించడంపై అక్కడి న్యాయస్థానం స్టే విధించింది. ఈ విషయంలో తదుపరి విచారణ జూన్ 2న జరగనుంది.