జకార్తా : ఇండోనేషియాలో దాదాపు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 7 గంటల సమయంలో కేఎం కార్య ఇందా పేరుగల నౌక ఈశాన్య ఇండోనేషియాలోని మారుమూల ద్వీపమైన సననకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నార్త్ మలుకా రాష్ట్రంలోని టెర్నేట్ నగరం నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టిన 15 నిమిషాలకే ఓడలోని ఇంజిన్ గదిలో మంటలు వ్యాపించాయి. వెంటనే అందులో ఉన్న ప్రయాణికులతో పాటు సిబ్బంది అంతా నీటిలోకి దూకారు.
ఫెర్రీకి మంటలు వ్యాపించగా పొగ కమ్మేసింది. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది.. ప్రయాణికులను రక్షించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఘటనపై సముద్ర రవాణా డైరెక్టరేట్ జనరల్ ప్రతినిధి విష్ణువర్ధన మాట్లాడుతూ 22 మంది పిల్లలు, 14 మంది సిబ్బందితో సహా 181 మంది ప్రయాణికులను రక్షించేందుకు స్థానిక ఫిషింగ్ బోట్లు వినియోగించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.