లెఫ్ట్నెంట్ గా పూల్వామా అమరుడు
విభూతి శంకర్ సతీమణికి బాధ్యతలు
చెన్నై, మే 29: పూల్వామా అమరవీరుడు మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ సతీమణి నిఖిత కౌల్ సైన్యంలో చేరారు. ఆర్మీలో ‘లెఫ్టినెంట్’గా బాధ్యతలు చేపట్టారు. శనివారం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో నార్త్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి ఆమె యూనిఫాంపై లాంఛనంగా స్టార్స్ని అమర్చి సైన్యంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిఖిత తన భర్తను భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ‘నువ్వు వదిలివెళ్లిన మార్గంలోనే నా ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టాను. ఈ దారిలో నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావని నా ప్రగాఢ విశ్వాసం’ అని నిఖిత పేర్కొన్నారు. 2019లో పూల్వామా ఉగ్రదాడిలో విభూతి శంకర్ అమరుడయ్యారు. అప్పటివరకూ నిఖిత ఢిల్లీలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో పని చేసేవారు. భర్త మరణంతో సైన్యంలో చేరాలని నిశ్చయించుకున్నారు.