– బీఎల్ఏలకు మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఉప్పల వెంకట రమణ దిశానిర్దేశం
దమ్మపేట, జూలై 29 : అశ్వారావుపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) (ప్రత్యేక సమగ్ర పరిశీలన) ప్రక్రియ పురోగతిపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇన్చార్జి ఉప్పల వెంకటరమణ అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు. బుధవారం దమ్మపేట మండలంలోని తాటిసుబ్బనగూడెం గ్రామంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నివాసంలో వారిరువురూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పనుల తీరుపై ఇరువురు నేతలు క్షేత్రస్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిన్నటి వరకు ఆన్లైన్, డిజిటల్ విధానంలో ఎంత శాతం పరిశీలన పూర్తయింది, ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో ప్రక్రియ పెండింగ్లో ఉందనే గణాంకాలను పరిశీలించారు.
నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పనులు ఎక్కడెక్కడ మందకొడిగా సాగుతున్నాయో ఆరా తీశారు. అనంతరం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లతో (బీఎల్ఏ) ఫోన్లలో నేరుగా మాట్లాడారు. నూతన ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి పెండింగ్ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే బాధ్యతను బీఎల్ఏలు తీసుకోవాలని ఆదేశించారు. నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పగడాల నరేంద్ర, మండల మాజీ అధ్యక్షుడు దొడ్డ రమేష్ పాల్గొన్నారు.