న్యూఢిల్లీ, మే 29: కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద ఆదుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. వారికి ఉచితంగా విద్యను అందిస్తామని, వారికి 18 ఏండ్ల వయసు రాగానే ఒక్కొక్కరి పేరిట రూ.10 లక్షల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 18 నుంచి 23 ఏండ్ల వయసు వరకు ఐదేండ్ల పాటు ైస్టెపెండ్ ఇస్తామని, ఆ పిల్లలందరికీ ఆయుష్మాన్ భారత్ పథకంలో లబ్ధిదారులుగా చేర్చి రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని తెలిపారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఆదివారంతో రెండేండ్లు అవుతున్న సందర్భంలో ఈ సంక్షేమ చర్యలను ప్రకటించారు. ఈ మేరకు శనివారం తన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ కింద అందించనున్న లబ్ధిని వివరించారు. దేశ భవిష్యత్తుకు పిల్లలే ప్రాతినిధ్యం వహిస్తారని, వారికి అండగా నిలిచి కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పీఎం కేర్స్ ఫండ్కు ఉదారంగా ఇచ్చిన విరాళాల వల్లే ఈ సంక్షేమ చర్యలు చేపట్టడం సాధ్యమవుతున్నదని అన్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయినా, తల్లిదండ్రుల్లో ఒకరే ఉండి వారిని కోల్పోయినా, చట్టబద్ధమైన సంరక్షకుడిని/దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయినా ఆ పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్లో అర్హులని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
పిల్లలకు 18 ఏండ్ల వయసు రాగానే ఒక్కొక్కరి పేరిట రూ.10 లక్షల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రత్యేక పథకం ద్వారా పీఎం కేర్స్ నుంచి నిధులు సమకూరుస్తారు. దీన్ని 18 నుంచి 23 ఏండ్ల వరకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిచేందుకు వినియోగిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే సమయంలో వ్యక్తిగత అవసరాలకు ైస్టెపెండ్ ఉపయోగపడుతుందని పీఎంవో తెలిపింది. 23 ఏండ్ల వయసు రాగానే కార్పస్ ఫండ్ను ఏక మొత్తంగా అందజేస్తారు.
దేశంలో ప్రొఫెషనల్ కోర్సులు, ఉన్నత విద్య చదివేందుకు విద్యా రుణం లభించేలా సాయం చేస్తారు. రుణంపై వడ్డీని ‘పీఎం కేర్స్’ నుంచి చెల్లిస్తారు. ట్యూషన్ ఫీజులకు, అండర్గ్రాడ్యుయేట్/ ఒకేషనల్ కోర్సుల ఫీజులకు సమానంగా స్కాలర్షిప్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద అందేలా చూస్తారు. ప్రస్తుత స్కాలర్షిప్ పథకాలకు అర్హత లేని పిల్లలకు పీఎం కేర్స్ నుంచే వాటిని అందజేస్తారు. ఈ పిల్లలందరికీ ఆయుష్మాన్ భారత్లో రూ.5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు. పిల్లలకు 18 ఏండ్ల వయసు వచ్చే వరకు ప్రీమియంను పీఎం కేర్స్ నుంచే చెల్లిస్తారు.
పిల్లలను వారికి దగ్గర్లోని కేంద్రీయ విద్యాలయలో లేదా ప్రైవేటు పాఠశాలలో డే స్కాలర్గా చేర్పిస్తారు. ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తే విద్యా హక్కు నిబంధనల కింద ఫీజును ‘పీఎం కేర్స్’ నుంచి చెల్లిస్తారు. యూనిఫాం దుస్తులు, పుస్తకాలను కూడా సమకూరుస్తారు.
వీరికి సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయ వంటి కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. సంరక్షకులు, కుటుంబ సభ్యులు ఎవరైనా పిల్లల ఆలనాపాలనా చూస్తే కనుక వారికి దగ్గర్లోని కేంద్రీయ విద్యాలయలో లేదా ప్రైవేటు స్కూల్లో డే స్కాలర్గా చేర్పిస్తారు.