తూప్రాన్ రూరల్/రామాయంపేట, జూన్ 4 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తూప్రాన్ పట్టణ పరిధిలోని అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద రూ.కోటీ 60 లక్షలతో నిర్మించిన రైతు బజార్, మినరల్ వాటర్ ట్యాంకును శుక్రవారం జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమెల్సీ శేరి సుభాష్రెడ్డి, కలెక్టర్ హరీశ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధరను కల్పించడం కోసమే ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్యార్డులు, రైతు బజార్లను ఏర్పాటు చేసిందన్నారు. ఎన్నో ఏండ్లుగా రోడ్ల పక్కన కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్న చిరువ్యాపారుల కష్టాలు నేటితో తీరనున్నాయన్నారు. ఆధునాతన పద్ధతుల్లో నిర్మించిన రైతు బజార్లో వివిధ రకాలైన పండ్లు, కూరగాయలు, మక్క బుట్టలు, వేరు శనగలు, టీస్టాళ్లను పెట్టుకునేందుకు 50 మంది వరకు అవకాశం ఉంటుందన్నారు.
ఈ స్టాళ్లను ఎవరికి కేటాయించలేదని, ముందుగా వచ్చి కూర్చున్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రైతులు, చిరువ్యాపారులు సైతం ఇక్కడే కూరగాయలను విక్రయించుకోవాలన్నారు. అవసరమైతే మరిన్ని షెడ్లను నిర్మించి ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక నుంచి రైతులు రోడ్లపై విక్రయించకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. రైతుల శ్రేయస్సు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా రైతులకు రైతుబంధు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. 6 దశాబ్దాలుగా కానీ పనులను ఆరేండ్లలోనే తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు మరెక్కడా లేవన్నారు. కుటుంబంలో ప్రతి వ్యక్తికి నేడు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మోహన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, తూప్రాన్, మనోహరాబాద్ టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బాబుల్రెడ్డి, మహేశ్, మార్కెటింగ్ శాఖ ఎస్ఈ గణేశ్, డీఈ మాధవరెడ్డి, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, తహసీల్దార్ శ్రీదేవి, పట్టణ కౌన్సిలర్లు, తూప్రాన్, మనోహరాబాద్, శివ్వంపేట మండలాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతు ఆగ్రో సేవా కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలి : మంత్రి హరీశ్రావు
రైతులకు కావాల్సిన విత్తనాలు, వ్యవసాయ పని ముట్లను రైతు ఆగ్రో సేవా కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్రావు సూచించారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమెల్సీ శేరి సుభాశ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి నిర్వాహకులు చొరవ చూపించాలన్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదులు ఇవ్వాలన్నారు. విత్తన దుకాణాలు, డీలర్లపై ఎప్పటికప్పుడు టాస్క్ఫోర్స్ కమిటీలు నిఘా ఉంచుతాయన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఏవో నుస్రత్ పాల్గొన్నారు.