రూ.1000 జరిమానా విధిస్తున్న పోలీసులు
ఇప్పటికే మహబూబ్నగర్లో 100మంది, బాలానగర్లో 50మందిపై కేసులు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్11 :కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. మాస్క్ తప్పనిసరి అని చెప్పినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో మాస్క్ లేకుండా బయట తిరిగితే రూ.వెయ్యి జరిమానాతోపాటు తీవ్రతను బట్టి జైలుకు పంపించేందుకు సైతం పోలీసులు వెనుకాడడం లేదు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నారు.
కరోనా రెండో దశ విజృంభిస్తున్నందున మాస్కులు ధరించని వారు ఇకపై కేసుల్లో చిక్కుకొని న్యాయస్థానం ఎదుట నిలబడాల్సిందే.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాస్కు పెట్టుకోని వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో 68 జారీ చేసింది. మొదటి విడుతలో ఒకవైపు అవగాహన కల్పిస్తూనే.. మరో వైపు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా వ్యాపారసంస్థలు, దుకాణ సముదాయాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రచారం చేస్తున్నారు. మాస్కులు ధరించడంతోపాటు దుకాణాలకు వచ్చే వారికి కూడా మాస్కులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రెండోసారి కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్లు రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కోర్టులో చార్జిషీట్ దాఖలు
డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు మాస్కులు లేకుండా బయట తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయం తీసుకున్నారు. మాస్కులు ధరించకుండా బయట తిరిగేవారిపై జాతీయ విపత్తు చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. మాస్కులు ధరించాలని వారం పదిరోజులుగా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై ఆదివారం నుంచి జాతీయ విపత్తు చట్టం ప్రకారం కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లాలో 100మందికి పైగా మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. మాస్కులు ధరించని వారి ఫొటోలు తీసుకోవడంతోపాటు వారి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఆ వివరాలతో కోర్టులో చార్జిషీట్ వేయనున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రూ.1000 జరిమానా కానీ, జైలుశిక్షను కోర్టు నిర్ణయించే వీలుంది.
మాస్కు ధరించాలని అవగాహన
కొవిడ్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు కచ్చితంగా మాస్కులు ధరించాలని జిల్లాలో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మహబూబ్నగర్, జడ్చర్ల, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పోలీసులు కూడళ్ల వద్ద వాహనదారులకు మాస్కు ప్రాధాన్యత వివరిస్తున్నారు. బహిరంగ, పని ప్రదేశాల్లో జీవో నెం. 68 ప్రకారం కచ్చితంగా మాస్కు ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. మహబూబ్నగర్ పట్టణంలో ట్రాఫిక్ సీఐ అశోక్ కరోనా నివారణపై చాటింపు వేసి మాస్కులు ధరించాలని కోరారు. మహబూబ్నగర్, జడ్చర్ల, వనపర్తి పీఎస్ పరిధిలో కేసులు నమోదు చేస్తున్నారు. మహబూబ్నగర్, జడ్చర్ల, పలు గ్రామాల్లో కళాజాతా బృందాలు కరోనా నివారణపై కళారూపాలను ప్రదర్శిస్తున్నారు.
కేసులు నమోదు చేస్తాం
కరోనా కేసులు పెరుగుతుండడంతోపాటు కొవిడ్ నిబంధనలు పాటించకుండా, మాస్కులు ధరించకుండా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా రూ. 1000 జరిమానా విధిస్తున్నాం. ఇప్పటివరకు మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వంద మందిపై కేసులు నమోదు చేశాం. మున్సిపల్ సిబ్బందితో కలసి మాస్కులు ధరించకుండా తిరిగేవారిపై జరిమానా విధిస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ టీంతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ
పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు చూపుతారు
గొంతునొప్పి తగ్గాలా..అయితే వీటిని తీసుకోండి..!
అమెరికా అధ్యక్షుడిగా రాక్కు జై