Palamuru | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): దశాబ్దాల ఆర్తిని తీర్చి, వలసవెతలను తీర్చి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేసిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలమూరు నీరాజనం పలికింది. కండ్లారా చూసుకొని మురిసిపోయింది. కైమోడ్పులు చెప్పింది. కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజానీకం కదిలివచ్చింది. రైతులు, మహిళలు, యువతీయువకులు, చిన్నారులు చిన్నాపెద్ద అనే తేడా లేకుండా యావత్ మహబూబ్నగర్ పబ్బతి పట్టి జేజేలు కొట్టింది. మహబూబ్నగర్ క్లాక్ టవర్ వద్ద కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నది. బీజేపీ, కాంగ్రెస్ దగాను కేసీఆర్ ఎండగట్టిన తీరుకు ఈలలతో హోరెత్తించింది. బీఆర్ఆర్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర మూడోరోజైన శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్ను నుంచి ప్రారంభమైంది.
అక్కడి నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వద్ద దిగి పాలమాకుల మీదుగా జడ్చర్ల నియోజకవర్గంలోని మాచర్లకు 5.45 చేరుకున్నది. అక్కడ ఫుడ్కోర్టులో తేనేరు తీసుకున్న తర్వాత 6.30 గంటలకు బస్సుయాత్ర మళ్లీ ప్రారంభమైంది. జడ్చర్ల, కొత్తూరు మీదుగా మహబూబ్నగర్ పట్టణంలోని మట్టిగడ్డ ప్రాంతానికి చేరుకున్నది. న్యూటౌన్, బస్టాండ్ మీదుగా క్లాక్ టవర్కు చేరుకున్నారు. దారిపొడవునా గులాబీ దళపతికి పాలమూరు ప్రజానీకం పబ్బతి పట్టింది. కేసీఆర్ రాక తెలుసుకొని ఆయా రూట్లలోని సమీప గ్రామాల నుంచి ప్రజలు, కర్షకులు, మహిళలు భారీగా రోడ్లపైకి తరలివచ్చి జయజయధ్వానాలు పలికారు. దారివెంట ఆటోలు, బస్సుల్లోని ప్రజలు సైతం బస్సుయాత్రలో కేసీఆర్ను చూసేందుకు ఎగబడ్డారు. రోడ్డువెంట ఉన్న రైతులు, దుకాణాదారులు కేసీఆర్కు కైమోడ్పులు చెప్పారు.
బస్సుయాత్రలో కేసీఆర్ చూసి ఉద్యమనేతను కలగన్నారు. బస్సుయాత్రలో సెల్ఫీల కోసం ప్రజలు పోటీపడ్డారు. ముఖ్యంగా పట్టణవాసులు, యువతీయువకులు బస్సుయాత్రను తమ మొబైల్ ఫోన్లలో బంధించుకున్నారు. బస్సులోని కేసీఆర్ను ఫొటోలు తీసుకుని మురసిపోయారు. బస్సుయాత్ర కాన్వాయ్ పక్కన నిల్చుని ఫొటోలు దిగారు. బీఆర్ఎస్ శ్రేణుల సంబురానికి అంతులేకుండాపోయింది. అధినేతనే స్వయంగా తరలిరావడం ఆనందడోలికల్లో మునిగిపోయారు. ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. బస్సు యాత్ర దారిపొడవునా ‘జై కేసీఆర్.. జై బీఆర్ఎస్” నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ నమ్మి మోసపోయిన రైతాంగం కేసీఆర్ను చూడగానే గత పదేండ్ల పాలనను తలచుకున్నారు. ‘తినే కూట్లే మన్నుపోసుకున్నం” అని రైతులు చర్చించుకోవడం విశేషం.