మహబూబ్నగర్ నుంచి ప్రత్యేక ప్రతినిధి/మహబూబ్నగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)/జడ్చర్ల: పాలమూరులో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ దళపతిపై అభిమానం వెల్లువెత్తింది. అడుగడుగునా ఘన స్వాగతం.. జై తెలంగాణ నినాదాలతో పట్టణం హోరెత్తింది. గడియారం చౌరస్తాలో కార్నర్ మీటింగ్ జనహోరును తలపించింది. శాసనసభ ఎన్నికల తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన కేసీఆర్ను చూడటానికి అభాలగోపాలం తండోపతండాలుగా తరలివచ్చింది. జడ్చర్ల, పాలమూరు రహదారులు గులాబీ పూతోటలను తలపించాయి. రైతులు, మహిళలు, వృద్ధులు దారిపొడవునా కేసీఆర్ను చూడటానికి బారులు తీరారు. జడ్చర్ల నుంచి ప్రారంభమైన రోడ్ షో మహబూబ్నగర్ పట్టణంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఎన్నికల ప్రచార సభ జరిగిన క్లాక్టవర్ వరకు రోడ్కు ఇరువైపులా కిక్కిరిసిన జనంతో పాలమూరు జనసంద్రంగా మారింది.
ఈ సందర్భంగా జననేత కేసీఆర్పై పూలవర్షం కురిపించారు.-సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. డోలు, డప్పు వాయిద్యాల మధ్య కళాకారులు స్వాగతం పలికారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారదతోపాటు బీఆర్ఎస్ మహిళా నేతలు కేసీఆర్కు హారతులు పట్టారు. తెలంగాణ సంప్రదాయక డప్పులు, డిల్లెం-పల్లెం వాయిద్యాలు ఒకవైపు, కేసీఆర్ జిందాబాద్ నినాదాలతో ప్రతిధ్వనించాయి. బస్సులో నుంచి కేసీఆర్ చేయి ఊపుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగిపోవడంతో జనం ఆనందంతో పరవశించిపోయారు. కేసీఆర్ను చూడగానే జన హృదయాలు ఉత్సాహంతో నిండిపోయాయి. రైతులు పట్టరాని ఆనందంతో తమ మెడలో ఉన్న గులాబీ కండువాలు, పార్టీ జెండాలు ఊపుతూ డ్యాన్స్లు చేశారు. సభ జరిగిన క్లాక్ టవర్ చౌరస్తా కూడలిలో ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. చూట్టూరా ఉన్న షాపులపై కూడా కిక్కిరిసిన జనంతో నిండిపోయింది. తాను సీఎంగా ఉన్నప్పుడు అమలుచేసిన రైతుబంధు ఉంటదో.. ఊడుతదో అని కేసీఆర్ వేదికపై అన్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన వర్ణాణాతీతం. తాను ఉన్నపుడు ప్రభుత్వం ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుండే అని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు జనంలో నుంచి వ్యక్తమైన ఆర్థనాదాలు చూస్తే కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకతకు అద్దం పట్టింది. ఒక్క ముసలమ్మ అయితే బిడ్డా ‘నువ్వు ఉన్నప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరికి పైసలు ఇచ్చేటోడివి.. ఇప్పుడెవ్వరు ఇస్తారు’ అని కన్నీళ్ల పర్యాంతం అయింది. కేసీఆర్ పాలమూరుకు వస్తుండని తెలిసి చూద్దామని వచ్చాను బిడ్డా అని చెప్పింది.