తిరుమల, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహార్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లుచేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనంచేశారు. చైర్మన్, ఈవోలు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేసి, శేషవస్త్రంతో సత్కరించారు.
తిరుమలలో ఉగాది ఆస్థానం
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానంను నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. 13న తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి చేయనున్నారు. 6 గంటలకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, విశ్యక్సేనులవారికి విశేష సమర్పణ చేయనున్నారు. 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి వేంచేయనున్నారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్ర్తాలను ధరింపచేసి పంచాంగ శ్రవణం చేయనున్నారు. ఉగాది ఆస్థానం కారణంగా 13న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవను టీటీడీ రద్దుచేసింది.