బెంగళూరు: జూలో ఉన్న నీటి గుర్రం గర్భం దాల్చింది. దానికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు పశువైద్యురాలు ప్రయత్నించింది. ఈ సందర్భంగా హిప్పోపొటమస్ ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పశువైద్యురాలు చికిత్స పొందుతూ మరణించింది. (Veterinarian Dies in Hippo Attack) కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల సమీక్షా రెడ్డి పశువైద్యురాలు. తావరెకొప్ప లయన్ అండ్ సఫారీ జూలో కాంట్రాక్ట్ పద్ధతిలో పశువైద్యురాలిగా ఆమె పని చేస్తున్నది.
కాగా, గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో సన్ కోన్యూర్ పక్షి ఆరోగ్యాన్ని సమీక్షా రెడ్డి పరిశీలించింది. ఆ తర్వాత రాత్రి 11.45 గంటల సమయంలో గర్భంతో ఉన్న హిప్పోపొటమస్ను చూడటానికి వెళ్లింది. ఆ జంతువు శరీర ఉష్ణోగ్రతను థర్మల్ కెమెరాతో పరిశీలించిస్తుండగా ఆమెపై అది దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పశువైద్యురాలు సమీక్షా రెడ్డిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా శస్త్రచికిత్స చేశారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆమె మరణించింది.
మరోవైపు ఇది దురదృష్టకర సంఘటన అని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అన్నారు. సమీక్షా రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. నిబంధనల ప్రకారం ఆ కుటుంబానికి నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ఆ రాష్ట్రంలోని అన్ని జంతు ప్రదర్శనశాలల్లోని పశువైద్యులు, వన్యప్రాణులకు చికిత్స సందర్భంగా ప్రామాణిక కార్యాచరణ విధానాల(ఎస్ఓపీ)ను ఖచ్చితంగా పాటించాలని మంత్రి ఈశ్వర్ ఖండ్రే సూచించారు. సీనియర్ పశువైద్యులు, అటవీ శాఖ అధికారులతో కూడిన బృందంతో ఈ సంఘటనపై విచారణ జరిపించాలని, ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.
Also Read:
Acid Thrown On School Girl | స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలిక.. ముఖంపై యాసిడ్ పోసిన వ్యక్తి
Watch: శవాల మాదిరిగా నీటిలో తేలిన జంట.. వింత ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్