చండీగఢ్: హోలీ నాడు ఒక వ్యక్తి తన స్నేహితుడి ప్రియురాలికి రంగులు పూశాడు. దీంతో అతడు ఆగ్రహించాడు. ఈ గొడవ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తికి మద్యం తాగించి రైలు పట్టాలపై ఉంచి రైలుతో ఢీకొట్టించి హత్య చేశారు. (Applies Holi colour to friend’s lover, Man Killed) హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహమూద్పూర్ గ్రామానికి చెందిన సంజు ప్రియురాలికి హోలీ రోజున స్నేహితుడైన 23 ఏళ్ల కలు రంగులు పూశాడు. దీంతో సంజు, కలు మధ్య గొడవ జరిగింది.
కాగా, వారిద్దరి మధ్య పాత గొడవ కూడా ఉన్నది. గతంలో సంజు బైక్ను కలు తీసుకెళ్లాడు. ప్రమాదం జరుగడంతో ఆ బైక్ దెబ్బతిన్నది. నష్ట పరిహారం గురించి వారిద్దరి మధ్య వివాదం కొనసాగుతున్నది. తాజాగా మార్చి 4న హోలీ రోజు తన ప్రియురాలికి రంగులు పూసిన కలును హత్య చేయాలని సంజు భావించాడు. స్నేహితులైన రాహుల్, విశాల్తో కలిసి ప్లాన్ వేశాడు.
మరోవైపు హోలీ సెలబ్రేషన్ తర్వాత కలుతో కలిసి వారు మద్యం సేవించారు. కలుతో ఎక్కువగా మద్యం తాగించారు. మత్తులో ఉన్న అతడ్ని బైక్పై పానిపట్లోని రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సంజు స్క్రూడ్రైవర్తో కలు మెడపై రెండుసార్లు పొడిచాడు. కలు చావకపోవడంతో వారు దారుణానికి పాల్పడ్డారు. అతడి చేతులు, కాళ్లు పట్టుకుని రైల్వే పట్టాల మధ్యలో పడుకోబెట్టి వెళ్లిపోయారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో కలు శరీరం ఛిద్రమై అతడు మరణించాడు.
కాగా, హోలీ రోజున కలు మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదు అందింది. రైలు పట్టాల వద్ద అతడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడంతో అతడు మరణించినట్లు తొలుత అనుమానించారు. అయితే సాంకేతిక ఆధారాలు, మొబైల్ ఫోన్ లొకేషన్ డేటా పరిశీలించిన తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. నిందితులైన సంజు, రాహుల్, విశాల్ను అరెస్ట్ చేశారు.
Also Read:
Thermal Power Stations | డ్రోన్లతో దాడి చేస్తామని బెదిరింపు.. థర్మల్ పవర్ స్టేషన్ల వద్ద భద్రత పెంపు
Acid Thrown On School Girl | స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలిక.. ముఖంపై యాసిడ్ పోసిన వ్యక్తి
Woman dies after tooth extraction | పన్ను పీకిన తర్వాత మహిళ మృతి.. డెంటల్ డాక్టర్ పరార్
Russian oil tanker | చైనా వెళ్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్.. దారి మళ్లి భారత్కు ప్రయాణం