ముంబై: థర్మల్ పవర్ స్టేషన్లపై డ్రోన్లతో దాడి చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. (Thermal Power Stations) ప్రధాన థర్మల్ పవర్ స్టేషన్ల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. నాలుగు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద భద్రతను పెంచారు. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. విదర్భ ప్రాంతంలోని నాలుగు ప్రధాన థర్మల్ పవర్ స్టేషన్లను డ్రోన్లతో లక్ష్యంగా చేసుకుంటామని ఈమెయిల్ ద్వారా బుధవారం బెదిరింపు వచ్చింది. ఖాపర్ఖేడా, కోరాడి, చంద్రాపూర్, పారస్లోని విద్యుత్ కేంద్రాలను సైనైడ్ లేదా ప్రాణాంతక గ్యాస్ బాంబులు అమర్చిన డ్రోన్లతో పేల్చివేస్తామని అందులో హెచ్చరించారు.
కాగా, ఈమెయిల్ బెదిరింపుతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఖాపర్ఖేడా, కోరాడి థర్మల్ విద్యుత్ కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాల్లో ఐదు గంటల పాటు తనిఖీలు చేశారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ ఈ సోదాల్లో పాల్గొన్నాయి.
మరోవైపు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించలేదని పోలీస్ అధికారి తెలిపారు. అయినప్పటికీ నాలుగు ప్రధాన థర్మల్ పవర్ స్టేషన్ల వద్ద భద్రతను పెంచినట్లు చెప్పారు. ఈ బెదిరింపు నేపథ్యంలో థర్మల్ పవర్ స్టేషన్ల పరిసరాల్లో డ్రోన్లు ఎగురవేయడంపై కఠిన ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.
కాగా, ఈ బెదిరింపు ఈమెయిల్ తమిళనాడు నుంచి వచ్చినట్లుగా తెలుస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు. అయితే అసలు ప్రదేశాన్ని దాచిపెట్టడానికి ఐపీ అడ్రస్ను మాస్క్ చేశారా లేదా స్పూఫ్ చేశారా అని నిర్ధారించడానికి సైబర్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈమెయిల్ పంపినవారిని లేదా దాని వెనుక ఉన్న సంస్థను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Acid Thrown On School Girl | స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలిక.. ముఖంపై యాసిడ్ పోసిన వ్యక్తి
Woman dies after tooth extraction | పన్ను పీకిన తర్వాత మహిళ మృతి.. డెంటల్ డాక్టర్ పరార్
Indore Fire Blast | ఈవీ కారుకు మంటలు, పేలిన గ్యాస్ సిలిండర్లు.. ఏడుగురు సజీవ దహనం
Russian oil tanker | చైనా వెళ్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్.. దారి మళ్లి భారత్కు ప్రయాణం