Budget 2024 Live Updates | కొద్ది నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ రెండో విడత పాలనలో ఆఖరి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెడుతున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్తో నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సృష్టించారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి.. మోరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25 ఆశాజనకంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. కేంద్ర బడ్జెట్ మెరుగ్గా ఉందని స్వాగతిస్తూ ఎన్నో ఉపాధి అవకాశాలకు ఇది ఊతమిస్తుందని స్వాగతించారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కేంద్ర బడ్జెట్లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చేశారు. బడ్జెట్ పరిమాణం మొత్తం రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు.
Budget 2024 | రూ.47.66లక్షల కోట్లతో బడ్జెట్.. శాఖలు, పథకాల వారీగా కేటాయింపు ఇవే..!
పంటల సాగులో అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ యోజన పథకం కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందజేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
మూడు ఆర్ధిక కారిడార్లకు చెందిన కీలక ప్రకటన చేశారు. ఇంధన, ఖనిజ, సిమెంట్ రంగాలకు చెందిన ఓ కారిడార్ను రూపొందించనున్నట్లు మంత్రి చెప్పారు. హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్ను కూడా డెవలప్ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం పీఎం గతి శక్తి స్కీమ్ను బలోపేతం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ను మరింత బలోపేతం చేసేందుకు కొత్త స్కీమ్ను ప్రకటించనున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. కొత్తగా మూడు కోట్ల మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేయడమే తమ ప్రభుత్వ టార్గెట్ అని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా అయిదు సమీకృత ఆక్వా పార్క్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ఇండియా టాప్ ప్లేస్లో నిలిచిందన్నారు.
దేశ యువత కోసం కేంద్ర సర్కార్ భారీ ప్రకటన చేసింది. సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న యువతకు ఇది స్వర్ణయుగం కానున్నది. టెకీ యువతకు రుణాలు ఇచ్చేందుకు సుమారు లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తెలిపారు. ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా ఆ రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. సుదీర్ఘ కాలం ఫైనాన్సింగ్, రీ ఫైనాన్సింగ్ లో భాగంగా ఈ స్కీమ్ను చేపట్టనున్నారు.
గర్భాశయ క్యాన్సర్ (Cervical cancer) నిర్మూలనే లక్ష్యంగా టీకా కార్యక్రమాలు.
9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఆ టీకాలు.
ప్రసూతి, శిశు సంరక్షణ కోసం అనేక స్కీమ్లు.
వాడుకలోకి ఇమ్యూనైజేషన్ కోసం కొత్తగా డిజైన్ చేసిన యూ-విన్ ప్లాట్ఫామ్
బడ్జెట్ ప్రసంగంలో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రైల్వేల బలోపేతానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంటుందని ఫైనాన్స్ మినిస్టర్ తెలిపారు. ప్రధాన మంత్రి గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కోసం మూడు రైల్వే కారిడార్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వందే భారత్ను అప్గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దేశంలోని ఇతర నగరాలతో మెట్రో రైలు నమో భారత్ అనుసంధానిస్తుందన్నారు.
Budget-2024 | వందే భారత్ కోచ్ల తరహాలో 40వేల బోగీల అభివృద్ధి : నిర్మలా సీతారామన్
వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ రిలీఫ్ కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదిస్తూ.. వేతన జీవులకు కొత్త ఆదాయం పన్ను విధానం ప్రకటించారు. ఇంతకుముందు పాత ఆదాయం పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50 వేల వరకు మినహాయింపు ఉండేది. దాన్ని రూ.25 వేల వరకు పొడిగించారు. అంటే రూ.2.50 లక్షల నుంచి రూ.3.25 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల ఆదాయం వరకూ పన్ను రాయితీ అమలవుతుంది. కార్పొరేట్ సంస్థల ఆదాయంలో పన్ను చెల్లింపు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇక ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపుల విధానం యథాతథంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.23.24 లక్షల కోట్ల ఆదాయం లభించిందన్నారు. ఎగుమతి, దిగుమతి సుంకాల విధానం యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు.
పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రసంగం దాదాపు గంటపాటు ఆమె సాగింది.
డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ మూల సూత్రాలుగా భారత్ ముందడుగు వేస్తోంది.
2047 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాం.
అవకాశాల సృష్టితో ఆకాశమే హద్దుగా భారత్ ముందడుగు వేస్తోంది.
కొత్త ప్రపంచంతో అనుసంధానమవుతూ భారత్ దిక్సూచిగా నిలబడుతోంది.
దేశ తూర్పు ప్రాంతాన్ని నూతన అభివృద్ధి రథంగా మారుస్తున్నాం.
విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం ప్రకటించాం.
భారత్ నుంచి మధ్య ప్రాచ్చం మీదుగా యూరప్కు ప్రత్యేక కారిడార్.
మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు.
పిల్లల ఆరోగ్యం కోసం ఇంద్రధనస్సు కార్యక్రమం
దేశంలో కొత్తగా ఐదు సమీకృత ఆక్వా పార్కులు
పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం
నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తాం.
ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం.
స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆరోసారి కావడం విశేషం. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ భావనను బలోపేతం చేసిందని అన్నారు. 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసినట్లు తెలిపారు.
Budget 2024 | 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. బస్తీలు, అద్దె ఇండ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని వెల్లడించారు. మధ్య తరగతి కోసం కోసం కొత్తగా గృహనిర్మాణం విధానం తీసుకురాబోతున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇండ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చామన్నారు. కొవిడ్ కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అమలు కొనసాగించామన్నారు.
3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా ఉన్నామన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో మరో 2 కోట్ల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం వినిపిస్తూ.. జీడీపీకి ప్రభుత్వం కొత్త అర్థం చెప్పిందన్న ఆర్థిక మంత్రి.. జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్ పెర్ఫార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చామన్నారు. పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచామన్నారు. పదేళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం 50శాతానికిపైగా పెరిగిందన్నారు. వాసవ్త ఆదాయ పెరుగుదల ప్రజల జీవన ప్రమాణాలు పెంచిందన్నారు. ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. భారత్ను 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె అన్నారు. మోదీ సర్కార్కు చెందిన చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగినట్లు తెలిపారు. గడిచిన పదేళ్లలో మహిళల సాధికారత పెరిగిందన్నారు. ట్రిపుల్ తలాక్ను చట్టరీత్యా నేరం చేశామన్నారు. ప్రభుత్వ స్కీమ్ కింద 70 శాతం మంది మహిళలకు ఇండ్లు అందజేసినట్లు చెప్పారు. అన్ని రకాల మౌలికసదుపాయాల్ని రికార్డు సమయంలో క్రియేట్ చేస్తున్నట్లు తెలిపారు. భారత అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాలు భాగస్వామ్యం అవుతున్నాయన్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్ వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం మహిళల సంఖ్య పెరిగిందన్నారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు ఆమె వెల్లడించారు.
ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు.
బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నెరవేరుస్తాం.
ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.
మధ్య తరగతి కోసం నూతన గృహ నిర్మాణ విధానం తెస్తున్నాం.
వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం.
రూఫ్ టాప్ సోలార్ పాలసీ విధానం కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్.
ఈ పదేళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం 50 శాతానికి పెరిగింది.
వాస్తవ ఆదాయ పెరుగుదల ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది.
స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశాం.
గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇళ్లలో 70 శాతం మహిళల పేరుపైనే ఇచ్చాం.
జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చాం.
ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచాం.
నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారు.
సంస్కరణపథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది.
ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడింది.
మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాం.
ప్రజల ఆదాయం 50 శాతం పెరిగింది.
అన్ని రంగాల్లో ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నాం.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ సర్కార్ చివరి బడ్జెట్ కావడంతో.. ఈ చిన్న బడ్జెట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు.
మధ్యంతర బడ్జెట్కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, ఇతర మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 5 శాతం తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్లపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో భారతదేశంలో ఫోన్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు మరింత ఊరట కలుగనుండగా.. దిగుమతి సుంకం తగ్గడంతో మొబైల్ఫోన్ల ధరలు సైతం తగ్గే అవకాశాలున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదికలో స్మార్ట్ఫోన్ల తయారీకి ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. ప్రభుత్వం చర్య మేక్ ఇన్ ఇండియాను ఊతమిస్తుందని చెప్పింది.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత అందుకోబోతున్నారు. పార్లమెంట్లో ఆమె నేడు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఆర్థికమంత్రిగా నిర్మలమ్మ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. ఈ క్రమంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్నారు.
2019 జూలై నుంచి ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్ను నిర్మల ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్తో ఆమె వరుసగా ఐదుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన గత ఆర్థిక మంత్రులు మన్మోహన్సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను అధిగమించనున్నారు. ఇక మొరార్జీ దేశాయ్ 1959-64 మధ్య ఆర్థికమంత్రిగా వరుసగా ఐదుసార్లు వార్షిక బడ్జెట్, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా ఆయన 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బడ్జెన్ను ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీటు తినిపించారు. మరికాసేపట్లో మధ్యంతర బడ్జెట్ను నిర్మలమ్మ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ఆర్థిక మంత్రి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి నోరు తీపి చేశారు. స్వీటు తినిపించి గుడ్లక్ చెప్పారు.
Union Minister of Finance and Corporate Affairs Nirmala Sitharaman along with Ministers of State Dr Bhagwat Kishanrao Karad and Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union… pic.twitter.com/o2UrUCRuaH
— ANI (@ANI) February 1, 2024
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్కు బయల్దేరి వెళ్లారు.
కొద్దిసేపట్లో పార్లమెంట్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.17 గంటలకు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో 71,800, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 14 పాయింట్ల లబ్ధితో 21,739 పాయింట్ల వద్ద కొనసాగింది. 9.34 గంటలకు బీఎస్ఈ ఇండెక్స్ 247 పాయింట్లు లబ్ధి పొంది తదుపరి నష్టాల్లోకి పడిపోయింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 21,788 పాయింట్ల గరిష్టాన్ని తాకి, తిరిగి సుమారు 21,700 పాయింట్ల వద్ద తచ్చాడుతున్నది.
ఉమ్మడి నిజామాబాద్ ప్రజలకు పసుపు బోర్డు ఎన్నో ఏండ్లుగా కలగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటుపై బడ్జెట్లో ప్రస్తావించాలని కోరుతున్నారు. అలాగే రైల్వే అభివృద్ధిపైనా కూడా ఏమైనా ప్రకటనలు ఉంటాయేమోనని ఆశిస్తున్నారు. నిజామాబాద్ జంక్షన్గా అవతరించిన తర్వాత డబ్లింగ్ ఆశలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జనాభాకు తగ్గట్లుగా రైళ్ల రాకపోకలకు అనువుగా డబ్లింగ్ వ్యవస్థ ఏర్పాటు ఆవశ్యంగా మారింది. అయినప్పటికీ కేంద్రం మాత్రం ప్రజల అవసరాలను గుర్తించడంలో విఫలమవుతున్నది. ప్రస్తుతం సింగిల్ ట్రాక్ వ్యవస్థతోనే రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఇందులో ఎక్కువగా వాణిజ్యపరమైన అవసరాలకే ఈ ట్రాక్ను వినియోగిస్తున్నారు. ప్రజా రవాణాకు అంతగా ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు రైళ్లలో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే నిరీక్షణ తప్పడం లేదు. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వస్తున్నది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెన్ను మరికాసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రతులు ఇప్పటికే పార్లమెంట్కు చేరుకున్నాయి. వాటిని సభ్యులకు అందజేయనున్నారు.
#WATCH | Interim Budget copies arrive in Parliament, Finance Minister Nirmala Sitharaman to present her sixth straight budget today pic.twitter.com/ZFKdzcx7kt
— ANI (@ANI) February 1, 2024
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. గత ఏడాది అక్టోబర్లో నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కీలక ప్రకట చేశారు. . నరేంద్ర మోదీ ప్రకటన చేసి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ, అడుగు ముందుకు పడింది లేదు. కేంద్ర ప్రభుత్వంలో పసుపుబోర్డు ఏర్పాటుకు సంబంధించి నోట్ ఫైల్ ఆమోదానికి మాత్రమే పరిమితం కాగా.. ఎప్పుడు, ఎక్కడ స్థాపిస్తారనే అంశాన్ని కేంద్రం వెల్లడించలేదు. బీజేపీ ఎంపీగా ధర్మపురి అర్వింద్ కూడా పసుపుబోర్డుపై నోరు మెదపడం లేదు. తాను రాసిచ్చిన బాండ్ పేపర్కు సమాధానం ఇచ్చానంటూ చెప్పుకోవడం తప్ప పసుపుబోర్డు ఏదని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ 2024-25లోనైనా ఈ అంశం మరోసారి తెరపైకి వస్తుందా? అని పసుపు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల వేళ తప్పకుండా బీజేపీ సర్కారు ఈ తరహా మాయజాలాన్ని ప్రదర్శించే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు.
2024-25 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెన్ను మరికాసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్కు ముందు కేంద్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఈ భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
మధ్యంతర బడ్జెట్కు వేళైంది. పన్ను కోతలు, వడ్డనలపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఎప్పట్లాగే ఈ పద్దుపైనా సామాన్యులు.. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు, అందులోనూ వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా మధ్యంతర బడ్జెట్లో ఎటువంటి పెద్ద పన్ను సవరణలు ఉండకపోవచ్చనే అంటున్నారంతా. అయినప్పటికీ కొన్ని పన్ను మినహాయింపులను వ్యక్తిగత ట్యాక్స్పేయర్స్ ఆశిస్తున్నారు. పన్ను శ్లాబ్స్ను మార్చే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే పన్ను మినహాయింపునకున్న కనీస పరిమితిని ప్రస్తుతమున్న రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచితే మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరటేనని చెప్పుకోవచ్చు. అంతేగాక మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ.7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచవచ్చన్న అంచనాలూ నెలకొన్నాయి.
ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైల్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తున్నది. కేంద్రం ఈ సారి రైల్వే బడ్జెట్లో కేటాయింపులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వేలకు కేటాయింపులు రూ.3లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే వందే భారత్ రైళ్ల రోలింగ్పై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తున్నది. 2023 బడ్జెట్లో రైల్వేలకు మోదీ సర్కారు రూ.2.4లక్షల కోట్లు కేటాయించింది. రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కొత్త హైస్పీడ్ రైల్వే కారిడార్ను సైతం ప్రకటించే ప్రకటించేందుకు అవకాశం ఉన్నది.
కాసేపట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు చేరుకున్నారు. సభ్యలకు బడ్జెట్ ప్రతులను అందజేయనున్నారు. కాగా, ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో మధ్యంతర బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు.
#WATCH | Finance Minister Nirmala Sitharaman along with her team before the presentation of the country's interim Budget pic.twitter.com/hohpB7qtZi
— ANI (@ANI) February 1, 2024
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యంతర బడ్జెట్లో తాయిలాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని, మహిళా సాధికారిత పెరగాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ సారి బడ్జెట్లో వారికి పెద్దపీట వేయొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలతో రైతులలో ఉన్న వ్యతిరేకతను చల్లార్చడానికి వారికి తాయిలాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఆదాయపు పన్నులో మరింత ఊరట ఇవ్వాలని వేతన జీవులు కోరుతున్నారు.