Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆరోసారి కావడం విశేషం. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ భావనను బలోపేతం చేసిందని అన్నారు.
గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పురోగమించిందన్నారు. ఆయన ప్రధాని అయ్యాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం ఈ సవాళ్లను ఎదుర్కొందన్నారు. దేశానికి కొత్త లక్ష్యం, కొత్త ఆశ వచ్చిందన్నారు. ప్రజలు మళ్లీ భారీ ఆదేశంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. రెట్టింపు సవాళ్లను స్వీకరించామని, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మంత్రంతో పని చేశామన్నారు. సబ్కా ప్రయాస్ మంత్రంతో మనం కరోనా కాలాన్ని ఎదుర్కొన్నామన్నారు.
యువ దేశం ప్రస్తుతం గొప్ప ఆకాంక్షలు, అంచనాలను కలిగి ఉందన్నారు. గత 10 ఏళ్లలో అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికి నీరు, అందరికీ బ్యాంకు ఖాతాలు వంటి పనులను రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించామన్నారు. రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను పెంచామని, పారదర్శకతతో వనరుల పంపిణీ జరిగిందన్నారు. సామాజిక మార్పు తీసుకురావడానికి అసమానతలను తొలగించడానికి ప్రయత్నించామన్నారు.
పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించామన్నారు. పేదల సంక్షేమం, దేశ సంక్షేమం మంత్రంగా పనిచేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్ లక్ష్యంతో 25 కోట్ల మంది ప్రజలను వివిధ రకాల పేదరికం నుంచి బయటపడేశామన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయన్నారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపాయన్నారు.
పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛ స్థితికి చేరుకుందన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందన్నారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారన్నారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందన్నారు. సమ్మిళిత, సంతులిత ఆర్థిక విధానాలతో చిట్టచివరి వ్యక్తికి ప్రగతి ఫలాలు అందాయని చెప్పారు. ఇంటింటికీ విద్యుత్, ఇంటిల్లిపాదికి ఉపాధి, ఇంటింటికి తాగునీరు సమ్మిళిత అభివృద్ధికి నిదర్శనాలన్నారు.