తిప్పర్తి, జూలై 22: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరులో బుధవా రం రైతన్నలు విద్యుత్తు కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్స్టేషన్ వద్ద రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా కరెంట్ కట్ చే స్తుండటంతో నారుమడ్లు ఎండిపోవడంతో పాటు పొలాలు తడువక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మంత్రి కోమటిరెడ్డి స్పందించి కరెంట్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ విషయమై ఏఈని వివరణ కోరగా.. రోజుకు 17 గంటలపాటు కరెంట్ ఇస్తున్నామని, ఏదైనా విద్యుత్తు సమస్య వచ్చినప్పుడు కరెంట్ కట్ చేస్తున్నట్టు వెల్లడించారు.
గతంలో మాదిరిగా ఇప్పుడు రావడంలేదు
గతంలో కరెంట్ మంచిగా వచ్చేది. ఇప్పుడు సరిగా రావడంలేదు. కరెంట్ ఎం దుకు రావడం లేద ని అధికారులను అడిగితే పై అధికారులను అడుగమంటుండ్రు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు , నాయకులు స్పందించి కరెంట్ సరిగా వచ్చేటట్టు చూడాలి. – ఆవుల అంజయ్య, రైతు
అధికారులు ఫోన్లు ఎత్తడం లేదు
విద్యుత్తు సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి ఎందుకు కరెంట్ రావడం లేదని అడిగితే పై అధికారులకు ఫోన్ చేయమంటుండ్రు. పై అధికారులకు చేస్తే ఫోన్లు ఎత్తడంలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదు.
– జక్కలి మంగయ్య, రైతు