బెంగళూరు: కర్ణాటకలోని జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను (HD Revanna) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆయన తండ్రి, జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. మహిళ కిడ్నాప్ కేసులో అరెస్ట్ కాకుండా మధ్యంతర రక్షణ కల్పించాలన్న రేవణ్ణ అభ్యర్థనను బెంగళూరు కోర్టు తిరస్కరించింది. ఆ వెంటనే కర్ణాటక పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు.
కాగా, రేవణ్ణ ఇంట్లో సుమారు ఐదేళ్లు పని చేసి మానేసిన తన తల్లిని రేవణ్ణ సన్నిహితుడైన సతీష్ ఏప్రిల్ 26న తీసుకెళ్లాడని ఆమె కుమారుడైన 20 ఏళ్ల వ్యక్తి ఆరోపించాడు. ఆమెను అదే రోజున తిరిగి ఇంటికి తెచ్చారని, అయితే రేవణ్ణ సహాయకుడు ఏప్రిల్ 29న తిరిగి తీసుకెళ్లాడని, నాటి నుంచి తన తల్లి కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జేడీ(ఎస్) ఎమ్మెల్యే రేవణ్ణ, ఆయన అనుచరులపై కిడ్నాప్తోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు రేవణ్ణ సహాయకుడైన రాజశేఖర్కు చెందిన కళేనల్లిలోని ఫార్మ్ హౌస్లో ఆ మహిళను నిర్బంధించినట్లు సిట్ పోలీసులు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆమెను కాపాడారు. బెంగళూరుకు తీసుకువచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. కాగా, అసభ్యకర వీడియోల వ్యవహారంలో ఆరోపణలున్న రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయాడు. ఈ కేసుపై కూడా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.