Jyotiraditya Scindia : దళిత మహిళ గురించి మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే గౌరవం లేదని, ఆ పార్టీది వాడుకుని వదిలేసే మనస్తత్వమని విమర్శించారు. ఇటీవల జీతూ పట్వారీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఇమర్తీ దేవి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఇమర్తీ దేవి పేరులోని ఇమర్తి అనే పదం గురించి నొక్కి చెబుతూ.. ‘ఇమర్తి అంటే ఒక పాపులర్ స్వీట్’ అని వ్యాఖ్యానించారు. ఇమర్తీదేవి 2020 మార్చిలో జ్యోతిరాదిత్య సింథియాతో కలిసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల్లో ఒకరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఈ క్రమంలో ఆమె గురించి జీతూ పట్వారీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. జీతూ పట్వారీగానీ, కాంగ్రెస్ పార్టీగానీ మహిళల గురించి ఇంత దారుణంగా మాట్లాడుతారని తాను కలలో కూడా ఊహించలేదని సింథియా అన్నారు.
కాంగ్రెస్ పార్టీది వాడుకుని వదిలేసే తత్వమని జ్యోతిరాదిత్య విమర్శించారు. పార్టీ కార్యకర్తలు గానీ, గిరిజనులు గానీ, మహిళలు గానీ ఎవరినైనా అవసరమున్నంత వరకు వాడుకుని, ఆ తర్వాత వదిలేయడం కాంగ్రెస్ పార్టీకి మారిందని మండిపడ్డారు.