KCR | పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్యే పోటీ ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. బాగా బలిసిన ఆగర్భ శ్రీమంతుడు.. ఇక్కడ 26 ఏండ్లు తట్ట పట్టి లైట్ పెట్టుకుని బొగ్గు మోసిన భూగర్భ కార్మికుడు బరిలో ఉన్నారని.. వీరిలో ఎవరు గెలవాలో మీరే నిర్ణయించాలని ప్రజలకు సూచించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కొప్పుల ఈశ్వర్ను గెలిపిస్తే సింగరేణిని కాపాడతాడని తెలిపారు.
ఆరోజు నరేంద్ర మోదీ తన మెడ మీద కత్తి పెట్టి ఆస్ట్రేలియా బొగ్గు కొనాలి.. ఆదానీ బొగ్గు కొనాలంటే తాను ఒప్పుకోలేదని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్విట్జర్లాండ్ దావోస్కు వెళ్లి ఆదానీతో మాట ముచ్చట పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నాడని తెలిపారు. ముఖ్యమంత్రే వెళ్లి ఆదానీని ఆహ్వానించిండని పేర్కొన్నారు. సింగరేణిని కూడా ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. సింగరేణి.. తెలంగాణ కొంగు బంగారం అని అన్నారు. సింగరేణి పోతే మన బతుకులు ఎలా ఉంటాయనేది ఆలోచన చేయాలని సూచించారు.
పదేండ్ల కిందట నరేంద్ర మోదీ గెలిచినప్పుడు ఇంటికి 15 లక్షలు ఇస్తానని అన్నాడని.. మరి ఆ 15 లక్షలు వచ్చాయా? అని మంచిర్యాల ప్రజలను కేసీఆర్ అడిగారు. బేటీ బచావో – బేటీ పడావో ఏమన్నా జరిగిందా? సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ఏమన్నా వచ్చిందా? రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందా? అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీది గ్యాస్ కంపెనీ తప్ప.. ఏమీ లేదని విమర్శించారు. బీజేపీకి ఓటేసినా.. గోదాట్లో పడేసినా ఒక్కటే అని ఎద్దేవా చేశారు. బీజేపీతో మనకు ఏం ఒరగదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని అన్నారు. ఒక్క బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులను కాపాడుతానని.. భారీ మెజార్టీతో కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. అన్ని సర్వేల్లోనూ ఆటోమేటిక్గా పెద్దపల్లిలో కొప్పులనే గెలుస్తారని చెబుతున్నాయని.. అయినప్పటికీ మోసపోయి గోస పడొద్దని చెబుతున్నా అని పేర్కొన్నారు.