న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ మరో బాంబ్ పేల్చారు. ఆ పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు. అవినీతి, వేధింపులు, మహిళలపై దాడులు, గూండాలకు ప్రోత్సాహం వంటి కారణాల వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్లో పేర్కొన్నారు. (Swati Maliwal) 2006లో జాతీయ సేవ మార్గాన్ని ఎంచుకునేందుకు తన ఉద్యోగాన్ని వదిలేసినట్లు స్వాతి మాలివాల్ తెలిపారు. ఆర్టీఐ ఉద్యమం, అన్నా ఉద్యమం, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటుతో పాటు ఢిల్లీ మహిళా కమిషన్లో 8 సంవత్సరాలు అంకితభావంతో సేవ చేసినట్లు చెప్పారు. ప్రతి దశలోనూ పూర్తి నిజాయితీతో, అంకితభావంతో తన వంతు సహకారం అందించినట్లు స్వాతి మాలివాల్ తెలిపారు.
కాగా, 2024లో అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనపై జరిగిన దాడిని ఈ సందర్భంగా స్వాతి మాలివాల్ గుర్తు చేశారు. ‘ఆయన (అరవింద్ కేజ్రీవాల్) నివాసంలో, ఆయన సూచన మేరకే నాపై దారుణంగా దాడి జరిగింది. నాతో అత్యంత అసభ్యంగా ప్రవర్తించారు. తన గూండాను రక్షించుకోవడానికి ఆయన ఎంతకైనా తెగించారు, పైగా అతనికి ఉన్నత పదవులు కట్టబెట్టి బహుమతిగా ఇచ్చారు. నన్ను నాశనం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు, నాకు వ్యతిరేకంగా సాధ్యమైన అన్ని రకాల ప్రయత్నాలు చేశారు’ అని ఆమె ఆరోపించారు.
మరోవైపు స్థాపన సూత్రాలు, విలువలకు ఆప్ తిలోదకాలు ఇచ్చిందని స్వాతి మాలివాల్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ అండతో ఎవరికీ జవాబుదారీగా లేని విధంగా పార్టీలో అవినీతి పెరుగుతున్నదని ఆమె విమర్శించారు. ‘మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులు, గూండా ప్రవృత్తి ఉన్నవారికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని, అలాగే పంజాబ్లో జరుగుతున్న మోసాలు, దోపిడీని కళ్లారా చూసి.. నేను ఈ రోజు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నా’ అని ఎక్స్ పోస్ట్లో ఆమె పేర్కొన్నారు. తనతో పాటు ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు రాఘవ్ చద్దా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆప్ను వీడుతున్నట్లు స్వాతి మాలివాల్ వెల్లడించారు.
Also Read:
3 AAP MPs Remain | ఆప్లో మిగిలిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు వీరే
Tejashwi Yadav | నితీశ్ కుమార్ను రాజకీయంగా బీజేపీ అంతం చేసింది: తేజస్వీ యాదవ్
Woman Stabs Lover’s Wife | ప్రియుడి ఇంటికి వెళ్లి.. అతడి భార్యను దారుణంగా చంపిన ప్రియురాలు
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?