డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఐఐటీ రూర్కీలోని హాస్టల్ గదిలో క్వారంటైన్లో ఉన్న ఎంటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి ప్రేమ్సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇటీవల హాస్టల్లో పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలడంతో వారిని ఐసోలేషన్లో ఉంచారు. మృతుడికి సైతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. ఈ క్రమంలో నిర్బంధంలో ఉంచగా.. అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఇనిస్టిట్యూట్ హాస్పిటల్కు, ఆ తర్వాత సివిల్ హాస్పిటల్కు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కరోనా అయితే విద్యార్థి నోటి నుంచి నురగ వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు.
అయితే పోస్టుమార్టం నివేదిక తర్వాతే మరణానికి కారణం తెలుస్తుందని ఐఐటీ మీడియా సెల్ ఇన్చార్జి సోనికా శ్రీవాస్తవ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇటీవల రూర్కీ ఐఐటీకి చెందిన విద్యార్థులు వంద మందికిపైగా వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు. బుధవారం సైతం రూర్కీ పరిసర ప్రాంతాల్లో కొత్తగా 164 కొవిడ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో 46 మంది ఐఐటీకి చెందిన వారు కాగా.. ఇందులో విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఉన్నారు. వైరస్ సోకిన వారిని కొవిడ్ కేర్ సెంటర్, హోంఐసోలేషన్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎంఎస్ డాక్టర్ సంజయ్ కన్సల్ తెలిపారు.