Arvind Kejriwal | 2018 పరువు నష్టం కేసు (defamation case)లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఊరట లభించింది. యూట్యూబర్ ధ్రువ్ రాథీ వీడియోను రీట్వీట్ చేసిన కేసులో కేజ్రీవాల్పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఆదేశించింది. ఈ మేరకు కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
కాగా, యూట్యూబర్ ధ్రువ్ రాథీ (YouTuber Dhruv Rathee) 2018 మే నెలలో రూపొందించినట్లు చెబుతున్న ఓ వీడియోను కేజ్రీవాల్ తిరిగి ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఒకరిని కించపరిచేలా ఉన్న వీడియోను ఇతరులకు పంపడం కూడా పరువునష్టం చట్టం కింద నేరమే అవుతుందని, అలాంటి విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కేజ్రీవాల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఆ వీడియోను రీట్వీట్ చేయడం పొరపాటు అని, కేసును మూసివేయాలని కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు. కేజ్రీవాల్ తన తప్పును అంగీకరించినందున ఈ కేసులో ఫిర్యాదుదారుని సూచనను సుప్రీంకోర్టు కోరింది. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది రాఘవ్ అవస్తీ కూడా దీనికి అంగీకరించారు. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.
Also Read..
Israeli embassy | ఇజ్రాయెల్ ఎంబసీ ఎదుట.. అమెరికా ఎయిర్ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
Russia – Ukraine War | ఆ వార్తలు అవాస్తవం.. రష్యా ఆర్మీ నుంచి భారతీయులందరినీ విడిపిస్తాం : కేంద్రం
Drug Racket | అంతర్జాతీయ డ్రగ్స్ దందా.. నిర్మాతను పార్టీ నుంచి తొలగించిన డీఎంకే