నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్ మునుపెన్నడూ లేని విధంగా సన్నద్ధం అవుతోంది. ఈనెల 4న కొలంబోలో అడుగుపెట్టడం మొదలు అక్కడి నాన్డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (ఎన్సీసీ) మైదానంలో వరుసగా ఆరు రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా చెమటలు చిందించింది. ఇందులో మూడు రోజుల పాటు సాగిన పూర్తి స్థాయి వామప్ మ్యాచ్తో పాటు, మిగిలిన రోజుల్లో రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు సాగిన కఠిన నెట్ సెషన్లు ఉన్నాయి. గిల్సేన ఇంత ముమ్మరంగా సాధన చేయడం వెనుక రెండు కారణాలున్నాయి. ఒకటి 18 ఏండ్ల నుంచి లంకపై ఒక్క టెస్టు సిరీస్ కోల్పోని రికార్డును కొనసాగించడం..రెండోది ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేయాల్సిన అవసరం ఉండటం. దాంతో ఈనెల 15న మొదలయ్యే సిరీస్ కోసం టీమ్ మేనేజ్మెంట్ ఏ చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా పక్కా ప్రణాళికతో ఆటగాళ్లను సిద్ధం చేస్తోంది.
ప్రస్తుత జట్టులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్కు మాత్రమే లంకలో టెస్టు మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. మిగిలిన ఆటగాళ్లందరికీ ఇక్కడి పరిస్థితులు కొత్త. అందుకే లంకలో అడుగుపెట్టిన 24 గంటల్లోనే మైదానంలోకి దిగిన జట్టు ఇక్కడి విపరీతమైన వేడి, తీవ్రమైన తేమతో కూడిన వాతావరణానికి ఆటగాళ్లు అలవాటుపడేలా హెడ్ కోచ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్స్ను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, తిరిగి 2 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు విడతలుగా విభజించాడు.
లంక ఎలెవన్తో జరిగిన వామప్ మ్యాచ్ సమయంలోనూ ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లను మారుస్తూ, ఒకవైపు మ్యాచ్ ఆడుతూనే మరోవైపు సమాంతరంగా నెట్స్ ప్రాక్టీస్ చేయించడం గమనార్హం. ఎన్సీసీ మైదానంలో జరిగిన శిక్షణ ఎంత తీవ్రంగా సాగిందంటే, ప్రాక్టీస్ సెషన్ అని చూడకుండా ఫాస్ట్ బౌలర్లు నెట్స్లో పూర్తి వేగంతో విరుచుకుపడ్డారు. పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్ విసిరిన ఓ బంతి కెప్టెన్ శుభ్మన్ గిల్ కుడి చేతి వేలుకు బలంగా తాకి గాయపరిచింది. ముందు జాగ్రత్తగా వామప్ మ్యాచ్ రెండు రోజుల ఆటకు దూరంగా ఉన్న గిల్ ఆఖరి రోజున ఓపెనర్గా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు.
మూడు రోజుల వామప్ మ్యాచ్ ముగిసిన తర్వాత సోమవారం జట్టుకు విశ్రాంతి ఇస్తారని భావించినప్పటికీ, ప్రధాన పేసర్లను మినహాయించి మిగిలిన ఆటగాళ్లంతా ఎన్సీసీ మైదానంలో మళ్లీ మూడు గంటలకు పైగా చెమటోడ్చారు. టెస్టు మ్యాచ్లో నాలుగో రోజు నాటి పిచ్ను తలపించేలా పగుళ్లు ఉండి, స్పిన్, రివర్స్ స్వింగ్కు అనుకూలించేలా వికెట్ను తయారు చేయించుకొని మరీ దీనిపై జట్టులోని నలుగురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సారాంశ్ జైన్ బౌలింగ్లో బ్యాటర్లు తమ డిఫెన్స్, ఫుట్వర్క్ను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించారు.
సీనియర్ బ్యాటర్ రాహుల్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లపై సాధన చేశాడు. గతంలో ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో పరిస్థితులకు వేగంగా అలవాటు పడకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని పునరావృతం కాకుండా చూడాలనే కసి జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. కొలంబోలో ఆరు రోజులు ఉన్న గిల్సేన తొలి టెస్టు కోసం మంగళవారం గాలెకు చేరుకుంది. బుధవారం ఒక్క రోజు విశ్రాంతి తీసుకొని గురువారం నుంచి మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టి గాలె టెస్టులో ఆడే తుది జట్టుపై ఓ అంచనాకు రానుంది.
లంక పిచ్లపై ప్రధాన సవాలుగా మారే రివర్స్ స్వింగ్ను ఎదుర్కొనేందుకు గిల్ ప్రత్యేక ప్రణాళికను అమలు చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా తెప్పించిన కూకబురా రెడ్ బాల్స్లో కొద్దిగా పాతబడ్డ (సెమీ ఓల్డ్) బంతులతో ప్రాక్టీస్ చేశాడు. త్రో-డౌన్ స్పెషలిస్టులతో పాటు పేసర్ ఆకిబ్ నబీ బౌలింగ్లో రివర్స్ స్వింగ్ అవుతున్న బంతులను దాదాపు 20 నిమిషాల పాటు ఎదుర్కొన్నాడు. శ్రీలంకలోని పొడి వాతావరణం, రఫ్ ఔట్ఫీల్డ్ వల్ల బంతి త్వరగా మెరుపు కోల్పోయి రివర్స్ స్వింగ్కు అనుకూలిస్తుంది. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు గిల్ పాత బడ్డ బంతులతో ప్రాక్టీస్ చేశాడు.